డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఏపీ సర్కారు తీపికబురు: ఎస్జీటీలుగా 2193 మంది
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008 డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు అందించింది. 2193 మంది అభ్యర్థులకు మినిమమ్ టైమ్ స్కేల్తో ఎస్జీటీలుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వివరాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
Recommended Video

12ఏళ్ల డీఎస్సీ అభ్యర్థుల నిరీక్షణకు తెర
12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2008 డీఎస్సీ అభ్యర్థులకు సీఎం వైఎస్ జగన్ న్యాయం చేశారని తెలిపారు. మానవతా దృక్ఫథంతో డీఎస్సీ అభ్యర్థుల సమస్యను పరిష్కరించామని మంత్రి ఆదిమూలపు తెలిపారు. 2018 డీఎస్సీ అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 486 పీఈటీలు, స్కూల్ అసిస్టెంట్ పీఈటీలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నామని మంత్రి తెలిపారు.

డీఎస్సీ అభ్యర్థులనూ చంద్రబాబు మోసం చేశారు
గతంలో బీఈడీ అభ్యర్థులు చాలా అవకాశాలు కోల్పోయారని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం 2008 డీఎస్సీ అభ్యర్థులను అసలు పట్టించుకోలేదన్నారు. డీఎస్సీ అభ్యర్థులను కూడా చంద్రబాబు మోసం చేశారని మంత్రి మండిపడ్డారు. కాగా, టెట్-2021 సిలబస్ను కూడా మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు.

సరైన సమయంలోనే పరీక్షలు
ఏపీలో పది, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై అధికారులతో చర్చించామని, ప్రస్తుతం పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదన్నారు. ఆల్ ఇండియా పరీక్షలకు సిద్ధం అవడానికి కూడా విద్యార్థులకు సమయం కావాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదన్నప్పుడు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎటువంటి భయంలేని సమయంలోనే పరీక్షలు ఉంటాయని చెప్పారు. ప్రైవేటు యాజమాన్యాలకు మద్దతుగా కొన్ని పార్టీలు పరీక్షలపై రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. ఒక తండ్రిగా తాను పరీక్షల నిర్వహణకే మద్దతిస్తానన్నారు. నారా లోకేష్లాగా అందరూ దొడ్డిదారిలో మంత్రి పదవులు పొందలేరని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తోందన్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటికే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో కూడా రద్దు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications