జగన్కు మంచి అవకాశం.. రమ్మన్నా మళ్లీ మళ్లీ రాదు!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాష్ట్రపతి ఎన్నికలనేవి మంచి అవకాశం లాంటివని, ఈ ఎన్నికలద్వారా రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రత్యేక హోదా లేదంటే ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి రాబట్టుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వానికి 1.2 శాతం ఓట్ల విలువ తక్కువగా ఉందని, మరోవైపు ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న తరుణంలో జగన్ అవసరం బీజేపీ పెద్దలకు బాగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైసీపీ, అన్నాడీఎంకే, బీజేడీ మద్దతిస్తాయనే ధీమాలో అధికార ఎన్డీయే ఉంది. ఎన్డీయే కూటమి నుంచి కొన్ని పార్టీలను ఆకర్షించేలా అందరికీ అనుకూలమైన వ్యక్తిని నిలబెట్టాలని ప్రతిపక్ష కూటమి ప్రయత్నిస్తోంది. ఇటువంటి తరుణంలో ఏ పార్టీ ఎవరికి ఓటేస్తుందో అర్థంకాని పరిస్థితి. మొదటి నుంచి లోక్సభలో, రాజ్యసభలో బీజేపీకి మద్దతిస్తూ వస్తున్న వైసీపీ ఈసారి కూడా మద్దతిచ్చి రాష్ట్రానికి రావల్సిన నిధులను రప్పించుకొని మౌలిక సౌకర్యాలకు ఉపయోగించాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.
రాష్ట్ర అవసరాలకు అవసవరమైన అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. అత్యవర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకొని అవసరమైన రుణాన్ని పొందుతున్నారు. బ్యాంకు రుణాలతో సంబంధం లేకుండా ఉమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి కేటాయించిన ప్రాజెక్టులు, వాటికి అవసరమైన నిధులు పొందగలిగితే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా రాష్ట్రాన్ని నడిపించవచ్చని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఆ దిశగా ముఖ్యమంత్రి ప్రయత్నం చేయగలిగితే రాష్ట్రాన్ని వేధిస్తున్న పలు ఆర్థిక సమస్యల నుంచి సులువుగా బయటపడవచ్చంటున్నారు.