గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలక వీడారా, లేదా?, ఇబ్బందుల్లోను.. సోమిరెడ్డి
కేబినెట్లో చోటు దక్కనందుకు అలకవహించిన టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి శాంతించినట్లేనా? అంటే అవుననే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. నిన్నటి దాకా ఆయన పార్టీ వ్యవహారాల్లో,
అమరావతి: కేబినెట్లో చోటు దక్కనందుకు అలకవహించిన టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి శాంతించినట్లేనా? అంటే అవుననే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. నిన్నటి దాకా ఆయన పార్టీ వ్యవహారాల్లో, ఇతర కార్యక్రమాల్లో పూర్తిగా పాల్గొనలేదు. దీంతో గోరంట్లలో ఇంకా అసంతృప్తి ఉన్నదని కనిపిస్తోంది.
పార్టీ వ్యవహారాల్లో లోపాలున్నాయంటూ బహిరంగంగా గొంతెత్తిన ఆయన తర్వాత మౌనం వహిస్తున్నారు. ఇక ఈ విషయాల గురించి తానేమీ మాట్లాడనని ముందే ప్రకటించారు. రెండురోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప గోరంట్లతో మాట్లాడారు. రాజప్ప గురువారం విజయవాడ వెళ్తున్నారు. అక్కడ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించే అవకాశముంది.

పార్టీ అధిష్ఠానం ఆయనతో మాట్లాడి, సర్దిచెప్పవచ్చని అంటున్నారు. అయితే, శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల రాజమహేంద్రవరం, ధవళేశ్వరంలో పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. కాతేరులో జరిగిన బాబూ జగ్జీవనరామ్ జయంతి సభలో కూడా పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేటర్లు ఎవరి పనివారు చేసుకుంటున్నారు. దీంతో గోరంట్ల కొంత శాంతించారా అనే చర్చ సాగుతోంది.
బాధ్యతలు స్వీకరించిన సోమిరెడ్డి
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏపీని అగ్రి హబ్గా చేస్తానని చెప్పారు. లోటు బడ్డెట్ ఉన్నప్పటికీ రుణమాఫీ చేసిన చరిత్ర తమ ప్రభుత్వానిది అన్నారు. ఇబ్బందుల్లోను రుణమాఫీ చేశామన్నారు. మిర్చి రైతుల ఇబ్బందులు కేబినెట్లో చర్చిస్తామన్నారు.
తాను ఏ శాఖ అడగలేదని, తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ శాఖను అప్పగించారని సోమిరెడ్డి చెప్పారు. వ్యవసాయానికి సీఎం చంద్రబాబు ఎంతో ప్రాధాన్యమిస్తున్నారన్నారు. వ్యవసాయశాఖ మంత్రిగా పంటలకు గిట్టుబాటు ధర కల్పించటంతో పాటు రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కాగా, ఈ రోజు పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించారు.












Click it and Unblock the Notifications