ఇలాంటి ప్రతిపక్షాన్ని ఎప్పుడూ చూడలేదు: సభలో జగన్ పార్టీపై గోరంట్ల ఆగ్రహం
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రతిపక్షాన్ని ఎన్నడూ తాను చూడలేదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గురువారం సమావేశాలు ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన బాటపట్టారు. జల సంరక్షణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగిస్తున్న సమయంలో వారు స్పీకర్ వెల్ వద్దకు చేరుకుని నినాదాలు చేపట్టారు. హోదా అంశంపై చర్చించాలంటూ పట్టుబట్టారు.
సభా నాయకుడు మాట్లాడుతున్న సమయంలో ఆందోళన చేయడం సమంజసం కాదని స్పీకర్ చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల తీరుపై మంత్రి యనమల రామకృష్ణుడు అభ్యంతరం తెలిపారు. ఆందోళన చేస్తున్న సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు.
ఇలాంటి ప్రతిపక్షం ఎన్నడూ చూడలేదు..
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రతిపక్షాన్ని ఎన్నడూ తాను చూడలేదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. శాసనసభలో ప్రత్యేక హోదాపై సభలో చర్చించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేపట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
వైసీపీ ఎమ్మెల్యేల తీరుతో సభ్యుల హక్కులకు భంగం కలుగుతోందని.. ప్రజా సమస్యలపై చర్చ పక్కదారి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకోవడం ద్వారా సభా నియమాలను వారు ఉల్లంఘిస్తున్నారని అన్నారు. హోదా పేరుతో రాజకీయం చేయడం సరికాదని మంత్రి అచ్చెన్నాయుడు హితవు పలికారు.
అభివృద్ధి ఇష్టం లేకే..
శాసనసభలో ఆందోళన చేస్తున్న వైసీపీ సభ్యుల తీరును బీజేపీ శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఖండించారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగిలేలా ప్రతిపక్షం వ్యవహరించడం సభను అవమానపరచడమేనని విష్ణుకుమార్రాజు అన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అంశంమని, దీనిపై ఇప్పుడు ఆందోళన చేయడం పద్ధతిగా లేదన్నారు. అభివృద్ధి అంటే వైసీపీకి గిట్టదని వ్యాఖ్యానించారు.
సభ వాయిదా..
వైసీపీ సభ్యుల ఆందోళనతోఆంధ్రప్రదేశ్ శాసనసభ 10 నిమిషాల పాటు వాయిదా పడింది. సభ ప్రారంభమైన వెంటనే ప్రత్యేక హోదాపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకోవద్దని.. ఆ అంశంపై తర్వాత చర్చిద్దామని స్పీకర్ చెప్పినా వారు వినిపించుకోలేదు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.