టీడీపీ ఎమ్మెల్యేపై తిరగబడ్డ జనం.. బీజేపీ నాయకుడితో కలిసి నిలదీత
తూర్పుగోదావరి : పరామర్శించడానికి వెళ్లిన అధికార పార్టీ ఎమ్మెల్యే.. తప్పంతా మీదేనంటూ బాధితులపై ఆరోపణ చేయడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ఎమ్మెల్యే మాటలను తప్పుబడుతూ జనమంతా ఆయన కాన్వాయ్కు అడ్డు తగిలారు. అక్కడినుంచి కదలనిచ్చేది లేదంటూ రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు.
బాధితులకు అండగా బీజేపీ నేత కూడా ఎమ్మెల్యేను నిలదీయడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తూర్పు గోదావరి జిల్లా కోలమూరు పరిధిలోని జంగాల కాలనీలో చోటు చేసుకున్న సంఘటన ఇది. కాలనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు.

ఇక్కడిదాకా అంతా బాగానే ఉన్నా.. బాధితులతో మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యే గోరంట్ల బాధితులదే తప్పంటూ నోరుజారడం వివాదానికి దారి తీసింది. దీంతో రోడ్డుపైనే బాధితులకు ఎమ్మెల్యేకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బీజేపీ నాయకుడు శీతల్ కూడా బాధితుల పక్షాన నిలబడి ఎమ్మెల్యే తీరును నిరసించారు.
దీంతో ఒకరిపై ఒకరు అసభ్య పదజాలంతో దూషించుకున్నట్టుగా తెలుస్తోంది. గొడవ ముదురుతుండగా.. రంగప్రవేశం చేసిన పోలీసులు అక్కడున్న వారందరినీ చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం ఎమ్మెల్యే కాన్వాయ్ ను అక్కడనుంచి పంపించేశారు.












Click it and Unblock the Notifications