అయ్యారే.. స్వామి స్వరూపానందకు కోపం వచ్చింది జగన్ గారూ!!
విశాఖపట్నం శారదాపీఠం పీఠాధిపతి స్వామి స్వరూపానందకు కోపం వచ్చింది. దేవాదాయశాఖను అధికారులు బ్రష్టు పట్టిస్తున్నారంటూ వారిపై మండిపడ్డారు. వ్యక్తుల ప్రాబల్యం కోసం పాకులాడటమే సరిపోతుందని, శాఖలో పనితీరు అత్యంత అధ్వాన్నంగా ఉందంటూ నిప్పులు చెరిగారు. సింహాచలంలో దేవాదాయ శాఖ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి స్వరూపానంద స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవాదాయ శాఖ ఉద్యోగుల కార్యక్రమానికి హాజరై వారిపైనే విమర్శలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
దేవాదాయశాఖ అధికారుల తీరు వల్ల దేవుడి భూములకు సంబంధించి భూవివాదాలు, భూ కబ్జాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. భగవంతుడి ఆస్తులకే రక్షణ లేకుండా పోయిందని, తనకు తెలిసి రెవెన్యూ ఉద్యోగుల సేవలు దేవాదాయశాఖకు అవసరమన్నారు. 12 సంవత్సరాలుగా దేవాదాయ శాఖలో పదోన్నతులు లేకపోవడం విచారకరమని, కోర్టు వ్యాజ్యాలను పక్కనపెట్టి ఉద్యోగస్తులంతా ఒకేమాటపై నిలబడాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వంతో మాట్లాడి పదోన్నతులు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. దేవాదాయశాఖలో పని ఒత్తిడివల్ల ఉద్యోగాల సంఖ్యను పెంచాల్సి ఉన్నప్పటికీ వారిని నియమించకుండా రెవెన్యూ ఉద్యోగుల సేవలు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ నిర్ణయంపై దేవాదాయశాఖ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు స్వరూపానంద చేసిన వ్యాఖ్యలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించినట్లవుతోంది.