కరెంట్ మిగులు వస్తే తెలంగాణకే: చంద్రబాబు వెల్లడి
హైదరాబాద్: తమ రాష్ట్రంలో మిగులు విద్యుత్తు వస్తే తెలంగాణ రాష్ట్రానికే ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రెండు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలుస్తూ తీరిక లేకుండా గడిపిన చంద్రబాబు మంగళవారం సాయంత్రం మీడియతో మాట్లాడారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరం విద్యుత్తు అందిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలపై తాను ప్రధానితోనూ కేంద్ర మంత్రులతోనూ మాట్లాడినట్లు చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ఆదాయ లోటును భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి రాజధాని సహా కొన్ని ముఖ్యమైన సమస్యలున్నాయని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఉన్నతాధికారుల పంపిణీ జరగలేదని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయ మార్గాలు చూపాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరినట్లు ఆయన తెలిపారు. మిగతా రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధఇ చెందడానికి సహకరించాలని కేంద్రాన్ని అడిగినట్లు తెలిపారు. కేంద్రానికి కరువుపై నివేదిక పంపిస్తామని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన వనరులపై కేంద్రంతో మాట్లాడినట్లు చంద్రబాబు తెలిపారు.
విభజన చట్టంలోని ఆర్థిక ప్యాకేజీని త్వరగా అమలు చేయాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని అడిగినట్లు ఆయన చెప్పారు. ఎపిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సహకారం అందించాలని కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో 7,500 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పారు. ఎపికి మెగా ఫుడ్ ప్రాజెక్టులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని ఆయన అన్నారు. పెట్రో కెమికల్స్ కారిడార్ ఏర్పాటుకు సహకరించాలని తాను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరినట్లు తెలిపారు.
రాజధాని ఏర్పాటు కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ ఇప్పటి వరకు నివేదికను ఇవ్వలేదని చెప్పారు. రాజధాని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటేనే మేలు అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విభజన అనంతరం తలెత్తిన సమస్యల పరిష్కారానికి పూనుకుంటున్నట్లు తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో జపాన్ వెళ్లే ఆలోచన ఉందని, ఆంధ్రప్రదేశ్ను డిజిటల్ ఇండియాలో నెంబర్ వన్గా నిలపాలన్నదే తన ఆశయమని ఆయన అన్నారు.