అమరావతి కోసం 70 లక్షల మంది విద్యార్థుల నుంచి రూ.10 వసూలు!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రతి విద్యార్థి నుంచి రూ.10 వసూలు చేయాలని, తద్వారా రాజధాని నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కూడా ఉండేలా అవకాశం కల్పించాలని భావిస్తోంది.
రాజధాని అమరావతి నిర్మాణంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను కూడా భాగస్వామ్యం చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఈ శాఖ పరిధిలో మొత్తం 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే దాదాపు మూడు లక్షల మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.
అయితే, అందరి నుంచి డబ్బులు వసూలు చేయడం కాకుండా.. అమరావతి నిర్మాణంలో పాలుపంచుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి మాత్రమే తలా రూ.పది చొప్పున ఈ నెల పదో తేదీలోగా సేకరించనున్నారు.
మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు నుంచి అందిన ఆదేశాలను అనుసరించి జిల్లాలకు ఈ మేరకు సమాచారాన్ని సోమవారం పంపినట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సంధ్యారాణి తెలిపారు.
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రజలు, ఎన్నారైలు భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశ్యంతో గతంలో మై బ్రిక్ - మై అమరావతి అనే వెబ్సైట్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆన్లైన్ ద్వారా ఇటుకలను కొనుగోలు చేసి అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
8వేల మందితో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
జన్మభూమి - మా ఊరు కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో మంగళవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒకేసారి ఎనిమిది వేల మందితో జన్మభూమిపై ముఖ్యమంత్రి రోజువారీ సమీక్ష నిర్వహించారు.
చంద్రన్న సంక్రాంతి కానుక లబ్ధిదారులకు నాసిరకం సరుకుల పంపిణీపై సీఎం స్పందించారు. నాసిరకం సరుకుల పంపిణీపై అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను పేరు పేరునా ప్రస్తావిస్తూ అధికారులను నిలదీశారు. నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.
చంద్రబాబుతో రాజధాని అభివృద్ధి కమిటీ భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాజధాని అభివృద్ధి కమిటీ సమావేశమైంది. మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, ఎంపీ గల్లా జయదేవ్, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.