సీఎం జగన్ తాజా ఆదేశాలు - గ్రామ సచివాలయాల ఉద్యోగుల్లో కలకలం : రెచ్చగొడుతున్నాంటూ..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మానస పుత్రిక గ్రామ -వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. తాజాగా, పీఆర్సీ పైన సీఎం ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో పలు నిర్ణయాలు ప్రకటించారు. ఆ తరువాత ఆకస్మికంగా గ్రామ -వార్డు సచివాలయ ఉద్యోగుల్లో కలకలం మొదలైంది. గతేడాది అక్టోబరులోనే ప్రొబేషన్ ప్రకటించాల్సి ఉన్నా.. ప్రభుత్వం మరో ఆరు నెలలు వాయిదా వేయడం పై మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అధికారిక వాట్సాప్ గ్రూ పుల నుంచి వైదొలిగిన వ్యవహారం కలకలం రేపింది.
వెంటనే ప్రొబేషన్ ఇవ్వాలి
వెంటనే ప్రొబేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ లక్షా 30 వేల మంది ఉద్యోగు లు పోరుబాట పట్టారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టనున్నారు. ఆదివారం పలు చోట్ల గ్రామ, వార్డు ఉద్యోగులు వ్యాక్సినేషన్ కి ట్లు తీసుకెళ్లలేదు. సోమవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉన్నందున తీసుకెళ్లాలని అధికారులు ఆదేశించినా వెళ్లలేదు. ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. దీనికి కొనసాగింపుగా తమ ఆందోళనను మరింత ఉధృతం చేయనున్నారు. ఆందోళనలు చేపడితే చర్యలు తప్పవని ప్రభుత్వం నుంచి హెచ్చరికలు జారీ అయినప్పటికీ, ఉద్యోగ సంఘాలు కార్యాచరణను ప్రకటించాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన
చాలీచాలని వేతనంతో కుటుంబాలను పోషించుకోలేనిస్థితిలో ఉన్నామని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నా, తమ పట్ల వివక్ష చూపుతున్నారని వాపోతున్నారు. తమ బాధను ప్రభుత్వానికి తెలియజేసే ఉద్దేశంతోనే అన్ని వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల నుంచి వైదొలిగినట్లు పలు సంఘాల నాయకులు తెలిపారు. తొలుత విధులకు హాజరుకాకూడదని భావించగా, తర్వాత శాంతియుత విధానంలో నిరసనలు తెలపాలని అన్ని సంఘాలు నిర్ణయించాయి. సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ను డిక్లేర్ చేయడంతోపాటు పే స్కేల్ను ఖరారు చేయాలంటూ అన్ని మండలాల ఎంపిడిఒలు, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రాలను అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఉద్యోగులకు రెచ్చగొడుతున్నారంటూ
ప్రొబేషన్ను మరో ఆరు నెలలు పొడిగించడం వల్ల ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బంది పడతాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ- వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన పట్టటం వెనుక కొంత మంది రెచ్చగొడుతున్నారనే భావనలో మంత్రులు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను కొంతమంది రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకొంటున్నారని మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. జూన్ 30లోగా పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్వయంగా ప్రకటించారని, దీనిని పట్టించుకోకుండా సమ్మెకు ఎలా వెళతారని ప్రశ్నించారు. రోడ్లెక్కుతాం, ఆందోళన చేస్తామంటే అది వారి విజ్ఞతకు విడిచిపెడుతున్నామన్నారు.
సీఎం ఆదేశాలతో ఉద్యోగులతో చర్చలు
ఈ వ్యవహారం మరింత ముదరకుండా ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలపై సంఘాలతో సమావేశం నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ను సిఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఆయన సెలవును రద్దు చేసుకుని విజయవాడలోని తన కార్యాలయంలో సోమవారం సాయంత్రం మూడు గంటలకు అన్ని సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే అజయ్ జైన్ సమావేశానికి హాజరవుతామని సంఘాల నాయకులు తెలిపారు.