జగన్కు అవమానం?: ప్రోటోకాల్ పట్టించుకోని ప్రభుత్వం, కనీస భద్రత లేకపోతే!..
బుల్లెట్ ఫ్రూప్ వాహనంలో ఏసీ రావడం లేదని, పైగా అది శుభ్రంగా కూడా లేదని పోలీసులు మరో వాహనాన్ని తీసుకొచ్చారు.
అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో ఏపీ సర్కార్ అలసత్వం వహిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడికి కేటాయించాల్సిన వాహనాల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఈ ఆరోపణలకు తావిస్తోంది.
తాజాగా బుధవారం నాడు గుంటూరులో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వైఎస్ జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడినుంచి ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఓ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. అయితే బుల్లెట్ ఫ్రూప్ వాహనంలో ఏసీ రావడం లేదని, పైగా అది శుభ్రంగా కూడా లేదని పోలీసులు మరో వాహనాన్ని తీసుకొచ్చారు.

చేసేదేమి లేక జగన్ కూడా అదే వాహనంలో పర్యటన కొనసాగించారు. తిరుగు ప్రయాణంలో ఆ వాహనం కూడా మంగళగిరి వద్ద పంక్చర్ అయింది. దీంతో ప్రైవేట్ వాహనంలో ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవాల్సి వచ్చింది.
ప్రతిపక్ష నేత విషయంలో ప్రభుత్వం ప్రోటోకాల్ ను విస్మరిస్తుందనడానికి ఈ సంఘటనలే నిదర్శనం. రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా.. ప్రోటోకాల్ మాత్రం నిక్కచ్చిగా అమలు చేయాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పార్టీ పట్ల చిన్న చూపు ఉండవచ్చేమో గానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు భద్రతను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పార్టీ పోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం వాపోయారు. మరోసారి ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications