విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు పుల్ స్టాప్: రద్దు చేస్తూ ఉత్తర్వులు
అమరావతి: బాక్సైట్ తవ్వకాలు. ఈ పేరు వినగానే నిద్రలో నుంచి కూడా ఉలిక్కిపడతారు గిరిజనులు, ఆదివాసీలు, ఏజెన్సీ గ్రామాల నివాసులు. విశాఖపట్నం జిల్లాలో వందలాది హెక్టార్లలో విస్తరించిన విలువైన బాక్సైట్ నిక్షేపాలను తవ్వి తీయడానికి ప్రభుత్వాలు చేస్తూ వచ్చిన ప్రయత్నాలను ఎప్పటికప్పుడు నిరసిస్తూ, అడ్డుకుంటూ వచ్చారు గిరిజనులు. బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలని కోరుతూ దశాబ్దాల కాలం నుంచీ తమ పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ వ్యవహరంలో మావోయిస్టులు సైతం జోక్యం చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. బాక్సైట్ తవ్వకాలను నిలిపి వేయడానికి గిరిజనులు చేస్తోన్న నిరసలను అణచి వేయడానికి ప్రతీకారంగా.. ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమను మావోయిస్టులు కాల్చి చంపినట్లు చెబుతుంటారు.
నారదా కుంభకోణం: సీబీఐ వలలో ఐపీఎస్ చేప: మరో వికెట్!
బాక్సైట్ తవ్వకాలు నిలిపివేత
అలాంటి పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత ముగింపు పలికింది. విశాఖపట్నం ఏజెన్సీ గ్రామాలు, అడవుల్లో బాక్సైట్ తవ్వకాలను నిలిపి వేసింది.. శాశ్వతంగా. ఈ మేరకు గనుల శాఖ కార్యదర్శి కే రామ్ గోపాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బాక్సైట్ తవ్వకాల కోసం ఏజెన్సీ ప్రాంతంలోని వందలాది ఎకరాలను 30 సంవత్సరాల పాటు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) లీజుకు కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై వేర్వేరుగా ఆరు జీవోలను రామ్ గోపాల్ జారీ చేశారు. ఇకపై బాక్సైట్ తవ్వకాలు చోటు చేసుకోబోవంటూ ప్రభుత్వం వెల్లడించినట్టయింది.
పాదయాత్ర హామీ..
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బాక్సైట్ తవ్వకాలను నిలిపి వేసేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రతిపక్ష నేతగా చేపట్టిన పాదయాత్రలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే తన హామీని కార్యాచరణలోకి తీసుకొచ్చారు. బాక్పైట్ తవ్వకాలను శాశ్వతంగా నిలిపి వేసేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజా సంఘాలు, మేధావి వర్గాల నుంచి హర్షం వ్యక్తమౌతోంది. తాము చేపట్టిన పోరాటాలు ఎట్టకేలకు ఫలించాయంటూ వారు చెబుతున్నారు.
1521 హెక్టార్లలో బాక్సైట్ తవ్వకాలకు గత ప్రభుత్వాలు ప్రయత్నం
విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం జర్రెల బ్లాక్ 1, 2, 3, 4 పరిధిలోకి వచ్చే అటవీ ప్రాంతంలో 1162 హెక్టార్లు, అనంతగిరి మండలం గాలికొండ రిజర్వుడ్ ఫారెస్ట్ పరిధిలో 93.886 హెక్టార్లు, చింతపల్లి మండలం అరకు రిజర్వుడ్ ఫారెస్ట్ పరిధిలో 152 హెక్టార్లు, అనంతగిరి మండలం రక్తకొండ గ్రామం పరిధిలో 113.192 ఇదివరకు ప్రభుత్వాలు బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం కలిపి 1521 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని ఏపీఎండీసీకి 30 సంవత్సరాల పాటు లీజుకు కేటాయించారు. అప్పటి నుంచీ బాక్సైట్ తవ్వకాలకు ప్రయత్నాలు చోటు చేసుకుంటూ వచ్చినప్పటికీ.. గిరిజనులు, ఆదివాసీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. మావోయిస్టులు సైతం వారి పోరాటానికి మద్దతు ఇవ్వడంతో అరకొరగా తప్ప సమగ్రంగా తవ్వకాలు చోటు చేసుకోలేదు.
50 ఏళ్ల పోరాటం..
బాక్సైట్ నిక్షేపాల కోసం అడవులు, కొండలను తవ్వడం వల్ల తమ జీవితాలు నాశనమౌతాయంటూ గిరిజనులు, ఆదివాసీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ వస్తున్నారు. వారి ఉద్యమాలకు 50 సంవత్సరాల చరిత్ర ఉంది. తవ్వకాల వల్ల తాము నిలువ నీడను కోల్పోతామని, తమ జీవనం అస్తవ్యస్తమౌంతుందని, అటవీ, పర్యావరణానికి విఘాతం కలుగుతుందనే భయాందోళనలతో గిరిజనులు పోరాటం చేస్తున్నారు. ఇదివరకు అరకులో బాక్సైట్ తవ్వకాల కోసం ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ప్రదర్శన కూడా నిర్వహించారు. తాము అధికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాల జీవోలను రద్దు చేస్తామని భరోసా ఇచ్చారు. బాక్సైట్ అనుకూల జీవో నెంబర్ 97ను రద్దు చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి.