బ్లాంక్ జీవోల నుంచి లాక్ జీవోల వైపు ఏపీ పాలన ; జీవోలను దాచేస్తారా జగన్ : ప్రతిపక్షాల ధ్వజం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటి వరకు బ్లాంక్ జీవోల రగడ కొనసాగితే, ఇప్పుడు తాజాగా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఇకనుంచి ఆన్లైన్లో జీవోలు పెట్టకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవోలను ఆఫ్ లైన్ లోనే పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన చేస్తూ ఇంటర్నల్ సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవోల వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీల నుండి విమర్శలు వెల్లువగా మారాయి.
జగన్ తాజా నిర్ణయంతో తీవ్ర అసహనంలో ప్రతిపక్షాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ జీవోలు ఏవీ పబ్లిక్ డొమైన్లో పెట్టవద్దని జీవోలన్నీ ఆఫ్లైన్లో అధికారుల మధ్య మాత్రమే ఉండాలని తీసుకున్న నిర్ణయం తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు బ్లాంక్ జీవోలతో రహస్య పాలన చేస్తున్నారంటూ జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. సాక్షాత్తు జీవోల వ్యవహారంపై గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేశారు. జగన్ తన అవినీతి కోసమే బ్లాంక్ జీవోలను,రహస్య జీవోలను జారీ చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు నిప్పులు చెరిగారు. ఇక ఇదే సమయంలో బ్లాంక్ జీవోల నుండి లాక్ జీవోల వైపు ఏపీ ప్రభుత్వం వెళుతున్న తీరు ప్రతిపక్ష నేతలను తీవ్ర అసహనానికి గురి చేస్తోంది.
చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి జీవోలను దాచేస్తారా? దేవినేని ఫైర్
తాజా నిర్ణయంతో ప్రభుత్వ తీరుపై తెలుగు తమ్ముళ్లు నిప్పులు చెరుగుతున్నారు. తప్పుడు జీవోలు, అడ్డగోలు జీవోలతో ప్రభుత్వం పరువు అభాసుపాలు చేస్తున్నారని టిడిపి నేతలు ఫైర్ అవుతున్నారు . ఇకనుండి జీవోలు కనబడకుండా తీసుకున్న నిర్ణయంపై టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి జీవోలను దాచేస్తారా? మీకు నచ్చినవి మాత్రమే వెబ్ సైట్ లో పెట్టడం ప్రజల కళ్ళకు గంతలు కట్టడం కాదా? అంటూ నిప్పులు చెరిగారు. పాలనా పరమైన అంశాలను ప్రజలకు తెలియకుండా దాచి వారి హక్కులను హరించే అధికారం నీకెక్కడిది వైఎస్ జగన్ అంటూ ప్రశ్నలు సంధించారు.
ఇప్పుడు కనిపించని జీవోలు ఇదేనా పారదర్శక పాలన : టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు
అంతేకాదు రహస్య జీవోలు.. ఖాళీ జీవోలు.. ఇప్పుడు కనిపించని జీవోలు ఇదేనా పారదర్శక పాలన అని టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు నిప్పులు చెరిగారు. తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, తమ అవినీతి బయట పడకుండా ఉండడానికి జీవోలను ఆన్లైన్లో పెట్టొద్దని నిర్ణయం తీసుకున్నారని ఫైర్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోలను 2008 నుండి ఆన్లైన్లో పెడుతోందని, ఇకపై ఆన్లైన్లో జీవోలు పెట్టే విధానానికి స్వస్తి పలుకుతూ సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేశారని, ఏ తప్పు చెయ్యనప్పుడు జీవోలను ప్రజల ముందు పెట్టటంపై భయం దేనికని ప్రశ్నిస్తున్నారు. ఇదేమి తిరోగమనం అంటూ జగన్ సర్కారును నిలదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆన్లైన్ జీవోల సాంప్రదాయానికి తెరదించిన తుగ్లక్ అంటూ సీఎం జగన్ ను టార్గెట్ చేస్తున్నారు.
బ్లాంక్ జీవోల నుండి లాక్ జీవోల వైపు : బీజేపీ నేత లంకా దినకర్ ఫైర్
ఇదిలా ఉంటే బిజెపి నాయకులు సైతం జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో పై నిప్పులు చెరుగుతున్నారు. బ్లాంక్ జీవోల నుంచి లాక్ జీవోల వైపు రాష్ట్రంలో పాలన తిరోగమనంలోకి వెళ్లిందని బిజెపి నాయకుడు లంకా దినకర్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పాలనా పరమైన నిర్ణయాలు ప్రజలకు తెలియకూడదని ప్రభుత్వం అనుకుంటుంది అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే పథకాలను మాత్రం సీఎం జగన్ స్టిక్కర్లతో మీడియాలో వందకోట్ల ప్రజాధనంతో ప్రచారం చేసుకుంటున్నారని లంకా దినకర్ ఆరోపించారు.
ఏపీలో తారా స్థాయికి చేరిన జీవోల వివాదం
ప్రభుత్వ జీవోలు పబ్లిక్ డొమైన్ లో కనిపించే అవకాశమే లేకుండా జీవోల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్ రహస్య జీవోలు, బ్లాంక్ జీవోలు ఇచ్చి అవినీతికి , దోపిడీకి పాల్పడుతున్నారు అని జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్న టిడిపికి పెద్ద షాక్ ఇచ్చింది. ఇక జీవోలే కనిపించకుండా తీసుకున్న తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవోల వివాదం తారా స్థాయికి చేరుకుంది.