అమ్మఒడి లబ్దిదారులకు ఊరట: ఈ సారికి ఆ మినహాయింపు: కొత్త నిర్ణయం మేరకు..!
ముఖ్యమంత్రి జగన్ నవరత్నాల్లో కీలకమైన అమ్మఒడి పధకం నిర్వహణ ప్రభుత్వానికి పరీక్షగా మారుతోంది. వేలాది మంది లబ్దిదారులు నిబంధనల పేరుతో అనర్హతకు గురయ్యారు. దీంతో..ఇదే విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీని పైన ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని నిబంధనల విషయంలో సడలింపు ఇచ్చారు. అదే విధంగా కరెంట్ వినియోగం నిబంధన..స్కూళ్లల్లో హాజరు శాతం వంటి వాటి పైన సీఎం కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 9న సీఎం చిత్తూరు కేంద్రంగా అధికారికంగా ఈ పధకం ప్రారంభించనున్నారు. అయితే, అమ్మఒఢి సైట్ కొన్ని ప్రాంతాల్లో పని చేయటం లేదు. దీంతో..సమయం దగ్గర పడుతున్న కొద్దీ లబ్దిదారుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

హాజరు నిబంధన మినహాయింపు..
జగనన్న అమ్మ ఒడి పథకం కింద అర్హత పొందాలంటే విద్యార్థికి 75 శాతం హాజరు ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం ఈ సారికి సడలించింది. తొలి ఏడాది హాజరు నిబంధనలో మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి కచ్చితంగా 75 శాతం హాజరు నిబంధన పాటించాలని స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 61,344 మంది పిల్లల చిరునామాలు లభించడం లేదని, కొంత సమయం కావాలని అధికారులు కోరగా, త్వరగా వెరిఫికేషన్ పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. అదే విధంగా విద్యుత్ వినియోగం ఆధారంగా లబ్దిదారులన తప్పించటం పైనా చర్చ జరిగింది. 7,231 మంది అనాథ పిల్లలకు సంబంధించిన కుటుంబాలలో 300 పైబడి యూనిట్ల కరెంట్ వినియోగం అయినట్లు ఉందని, ఇందులో ఉమ్మడి కుటుంబాల పిల్లలు ఉన్నారంటూ క్షేత్రస్థాయి నుంచి వినతులు వస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు.

రీవెరిఫికేషన్ చేయండి...
క్షేత్ర స్థాయిలో మరోసారి రీ వెరిఫికేషన్ చేయించి అర్హులైన వారికి అమ్మఒడి వర్తింపజేయాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. వెబ్ల్యాండ్ రికార్డుల్లో తప్పుల కారణంగా భూమిలేని కొందరికి ఉన్నట్లు చూపిస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు చెప్పగా, అటువంటి వారిని పరిశీలించి వెంటనే అర్హులుగా గుర్తించాలని సీఎం ఆదేశించారు. ఈ కేటగిరీలో 1,38,965 మంది పిల్లలున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.

కొన్ని జిల్లాల్లో అమ్మఒడి సైట్
ఇదే సమయంలో జాబితా ఫైనల్ చేయటానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో అమ్మఒడి సైట్ ఓపెన్ కావటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి.
ఇంకా పలువురి ధ్రువపత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉన్నప్పటికీ సైట్ ఓపెన్ కాకపోవటంతో..ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో..పధకం ప్రారంభించిన తరువాత కూడా కొంత సమయం ఇవ్వాలని లబ్దిదారులు కోరుతున్నారు. దీని పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications