శ్రీవారి దయ వల్లే వర్షాలు: గవర్నర్, నెల్లూరు జాతీయ రహదారి తెగడంపై వెంకయ్య
చిత్తూరు: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయ వల్లనే రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం నాడు వ్యాఖ్యానించారు. గవర్నర్ దంపతులు ఉదయం తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
శ్రీవారి దయ వల్లే ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయన్నారు. రైతులు సుభిక్షంగా ఉండాలని తాను అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు.
కాగా, బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో సాధారణ స్థాయి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షం కొన్ని జిల్లాల్లో పెను నష్టాన్ని మిగిల్చింది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
వరద ఉద్ధృతికి జిల్లాలోని మనుబోలు-గూడూరు మధ్య జాతీయ రహదారి కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. జాతీయ రహదారి కొట్టుకుపోయిన ప్రదేశాన్ని ఏపీ మంత్రి నారాయణ సందర్శించారు.
జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురవ్వడంతో వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయకచర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగాయి. భారీ వర్షాలకు నెల్లూరు చెరువు పొంగి పొర్లుతోంది.
భారీ వర్షాల వల్ల ఏపీ, తమిళాడులో భారీ నష్టం జరిగింది. దీనిపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. ఏపీ, తమిళనాడు వరద నష్టాల పైన కేంద్రం సాయం చేస్తోందన్నారు. ఏపీ, తమిళనాడు వర్షాల ప్రభావాన్ని ప్రధాని మోడీకి వివరించానన్నారు. నెల్లూరు జాతీయ రహదారి పునరుద్ధరణకు చర్యలు చేపడతామన్నారు. జాతీయ రహదారి సంస్థ చర్యలు చేపడుతుందన్నారు.