విద్యార్థులకు నష్టం వద్దు: టీ సర్కార్కు గవర్నర్ ఆదేశం, ఏపీ ఓకే
హైదరాబాద్: తెలుగు విశ్వవిద్యాలయం, అంబేడ్కర్ ఓపెన్ వర్సీటీల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని గవర్నర్ నరసింహన్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు శనివారం లేఖ రాశారు.
దీని ప్రతులను రెండు విశ్వవిద్యాలయాల ఉప కులపతులకూ పంపారు. తుది నిర్ణయం తీసుకునే దాకా నిరుడు ఎలా ప్రవేశాలు జరిగాయో అదే విధంగా ఈసారి కూడా కొనసాగించాలని గవర్నర్ సూచించారు. విభజన చట్టంలోని పదో షెడ్యూల్లో ఉన్న ఈ విశ్వవిద్యాలయాలు తమకే చెందుతాయని టీ సర్కారు స్పష్టం చేసింది.
కావాలంటే ఆంధ్రప్రదేశ్కూ సేవలు అందిస్తామని చెప్పింది. సేవలు అందించాలంటే ఒప్పందం కుదుర్చుకోవాలంటూ సదరు విశ్వవిద్యాలయాలు కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖలు రాశాయి.

ఏపీ నుండి స్పందన లేదని కొద్ది రోజుల తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం కేవలం తెలంగాణకే పరిమితమై ప్రవేశాల ప్రకటన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ఇప్పటికే నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలను కేవలం తెలంగాణ విద్యార్థుల మేరకే విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల ఫలితాలను నిలిపేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రెండు విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన లేఖలను ప్రస్తావిస్తూ గవర్నర్ జోక్యం కోరింది. దీనిపై స్పందించిన గవర్నర్.. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా యథాతథస్థితిని కొనసాగించాలని కోరుతూ ఆ వర్సిటీలకు లేఖ రాశారు.
తెలుగు విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, శీశైలం, కూచిపూడిల్లో కేంద్రాలున్నాయి. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్లో బోధన కేంద్రాలున్నాయి. సేవలు అవసరం లేదనుకుంటే కేవలం తెలంగాణ మేరకే కేంద్రాలను పరిమితం చేయాలని, ఆంధ్ర విద్యార్థులు కావాలనుకుంటే ఇక్కడికొచ్చి ప్రవేశాలు తీసుకోవాలని సార్వత్రిక విశ్వవిద్యాలయం భావించింది.
అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి తెలంగాణ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శే ఇంఛార్జి వీసీగా వ్యవహరిస్తున్నారు. పదో షెడ్యూల్లోని సంస్థలపై హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చిందనీ, ఈ నేపథ్యంలో గవర్నర్ ఆదేశాలపై ఏం చేయాలో ఆలోచిస్తామని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మరోవైపు, పై విశ్వవిద్యాలయాల్లో మీ విద్యార్థులకు సేవలు అందించాలంటే రుసుము చెల్లించాలన్న తెలంగాణ సర్కారు ప్రతిపాదనకు ఏపీ సర్కార్ అంగీకరించింది. రెండు విశ్వవిద్యాలయాల నిర్వహణ వ్యయంలో జనాభా ప్రాతిపదికన 58 శాతం చెల్లించేందుకు ఒప్పుకుంది. అయితే, అంతకుముందే గవర్నర్ స్పందించి విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications