బాలకృష్ణ ఇష్యూ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్: వారించిన గవర్నర్, వివరాలకు బాబు నో, గంటన్నర భేటీ
అమరావతి: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం భేటీ అయ్యారు. విజయవాడలోని గేట్ వే హోటల్లో నరసింహన్ను కలిసిన చంద్రబాబు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువాతో సన్మానం చేశారు. అనంతరం వారు చాలాసేపు మాట్లాడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, కేంద్రం వైఖరిపై చర్చించారని తెలుస్తోంది. గవర్నర్, సీఎం... ఇరువురు గంట నలభై ఐదు నిమిషాల పాటు మాట్లాడుకున్నారు.
కేంద్రం ఏపీకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తోందని చెప్పినట్లుగా తెలుస్తోంది. హోదాతో పాటు ఏపీకి 18 అంశాలను కేంద్రం అమలు చేయలేదని చెప్పారని తెలుస్తోంది. ప్రధాని మోడీపై విమర్శలు సరికాదని చంద్రబాబు వద్ద గవర్నర్ చెప్పారని సమాచారం. ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యల విషయమై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది.

మోడీపై టీడీపీ నేతల వ్యక్తిగత దూషణలు
ప్రధాని మోడీపై టీడీపీ నేతల వ్యక్తిగత దూషణలు సరికాదని చంద్రబాబుతో గవర్నర్ నరసింహన్ వారించినట్లుగా తెలుస్తోంది. కేంద్రం నుంచి సాయం అందడం లేదని చంద్రబాబు ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ చీఫ్ కొద్ది రోజుల క్రితం సీఎంతో సమావేశమైన విషయం తెలిసిందే. ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికలోను అంశాలను కేంద్రం.. గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి వాటిపై సీఎంతో చర్చించాలని సూచించి ఉంటుందని భావిస్తున్నారు.

బహిరంగ సభపై చర్చ
ప్రధాని మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ చంద్రబాబు అసెంబ్లీలో, టీడీపీ నేతలు బయట ధనుమాడుతున్నారు. దీనిపై కూడా చంద్రబాబు -నరసింహన్ మధ్య చర్చ జరిగిందని భావిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన మోడీ తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంద ఇచ్చిన హామీలు అమలు చేయలేదని టీడీపీ నేతలు పదేపదే ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఆ దృశ్యాలను ప్రదర్శించి ఈ నెల 30న బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ బహిరంగ సభ అంశం చర్చ జరిగిందని తెలుస్తోంది.

ఉత్తరాది-దక్షిణాది కాదు.. సమస్యను పరిష్కరించుకోవాలి
ఇటీవల తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థికమంత్రులు, అధికారులు భేటీ అయ్యారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందని పేర్కొంటూ కేరళలో జరిగిన సమావేశంకు కొనసాగింపుగా అమరావతిలో చంద్రబాబు నిర్వహించే యోచనలో ఉన్నట్లుగా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు భావించాయి. అయితే, ఉత్తరాది - దక్షిణాది అనే వ్యత్యాసాలు సరికావని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని గవర్నర్... చంద్రబాబుకు హితవు పలికారని తెలుస్తోంది.

ఆ బృందం రిపోర్ట్ పంపించిందా?
పోలవరం, పట్టిసీమ, రాజధాని అమరావతి అంశాలపై అనుమానాలు, అవినీతిని బీజేపీ నేతలు తమ పార్టీ అధిష్టానానికి చెప్పారని తెలుస్తోంది. కేంద్రం నుంచి ఓ బృందం వచ్చి పరిశీలించి వెళ్లింది. ఆ బృందం నివేదిక అంశాలను గవర్నర్కు కేంద్రం పంపి ఉంటుందని, ఆ విషయమై ఇరువురి మధ్య చర్చ జరిగి ఉంటుందని అంటున్నారు.

వివరాలు వెల్లడించేందుకు చంద్రబాబు నో
చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష సమయంలో ప్రధాని మోడీని ఉద్దేశించి బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. దీని పైన కూడా చర్చ జరిగిందని సమాచారం. కాగా, భేటీ విషయాలను బయటకు వెల్లడించేందుకు ప్రభుత్వ వర్గాలు, చంద్రబాబు విముఖత చూపాయని తెలుస్తోంది. సమావేశం వివరాలను మీడియా ప్రశ్నించినా చంద్రబాబు చెప్పేందుకు నిరాకరించారని తెలుస్తోంది. మరోవైపు, తమ మధ్య భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని గవర్నర్ తెలిపారు.












Click it and Unblock the Notifications