త్వరగా విభజించాలి: గవర్నర్, కిరణ్పై ఢిల్లీలో ఫిర్యాదు!
న్యూఢిల్లీ: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ బుధవారం న్యూఢిల్లీలో పలువురు పెద్దలతో వరుసగా భేటీ అయి బిజీబిజీగా గడిపారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరించిన గవర్నర్ విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని పార్టీ, ప్రభుత్వ పెద్దలకు సూచించి ఉంటారని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరి గురించి వివరించినట్లుగా తెలుస్తోంది.
గవర్నర్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, మంత్రుల బృందం(జివోఎం) సభ్యులు చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, నారాయణ స్వామిలతో పాటు ఐబి చీఫ్ ఆసిఫ్ ఇబ్రహీం, ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ తదితరులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. సోనియాతో నరసింహన్ అరగంటకు పైగా భేటీ అయ్యారు. ప్రధానంగా ఆయన శాంతిభద్రతల అంశాన్ని ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.
జూలై 30న సిడబ్ల్యూసి ప్రకటన తర్వాత సీమాంధ్రలో ప్రారంభమైన ఉద్యమం, ఉద్యోగుల సమ్మె, సమ్మె కారణంగా తలెత్తిన పరిస్థితులు తదితర అంశాలను వివరించి ఉంటారంటున్నారు. విభజనపై నిర్ణయం తీసుకున్నందున పరిస్థితి సద్దుమణగాలంటే దానిని వేగవంతం చేయాలని, లేదంటే పరిస్థితి మలుపులు తిరిగే అవకాశముందని చెప్పినట్లుగా తెలుస్తోంది. కిరణ్ తీరు పైన గవర్నర్ సోనియాకు ఫిర్యాదు చేసినట్లుగా ప్రచారం సాగుతోంది.
విభజన నిర్ణయం నేపథ్యంలో ముఖ్యమంత్రి తీరును సోనియాకు వివరించిన గవర్నర్.. పార్టీని ధిక్కరించి కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు వస్తున్న వార్తలను కూడా ఆమె చెవిలో వేశారట. నిర్ణయం తీసుకున్నందున విభజన ఎంత త్వరగా జరిగితే అంత త్వరగా పరిస్థితి సద్దుమణుగుతుందని సూచించారట. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై నివేదిక కూడా ఢిల్లీ పెద్దలకు గవర్నర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.