టీడీపీ పెద్దాయనకు గవర్నర్ పోస్టు రెడీ..! వచ్చే నెలలో ప్రకటన..!
ఏపీలో ఈసారి బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వం నడుపుతున్న చంద్రబాబుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం లభిస్తోంది. ఇందులో భాగంగా కేంద్రంలో రెండు మంత్రి పదవుల్ని కూడా టీడీపీ తీసుకుంది. అయితే దీంతో పాటు మరికొన్ని కీలక పదవులు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ హింట్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా త్వరలో పార్టీ సీనియర్ నేతకు గవర్నర్ పదవి ఇచ్చేందుకు రంగం సిద్దమవుతోంది.
తెలుగుదేశం పార్టీలో మోస్ట్ సీనియర్ నేత అయిన మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యలో ఒక ఓటమి మినహాయిస్తే వరుసగా ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలుస్తూ రాష్ట్రమంత్రిగా, కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆయనది. టీడీపీలో చంద్రబాబుతో సమానమైన సీనియార్టీ ఉన్న అశోక్ గజపతిరాజుకు అవినీతి మరకలు అస్సలు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేసిన అనుభవం కూడా ఉంది.

దీంతో టీడీపీకి కేంద్రం తరఫున లభించే తొలి గవర్నర్ పోస్టును అశోక్ గజపతిరాజుకు ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో నాలుగు రాష్ట్రాల గవర్నర్లను కేంద్రం మార్చే అవకాశం ఉంది. ఇందులో అశోక్ గజపతిరాజుకు ఛాన్స్ లభించబోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గవర్నర్ పోస్టు కోసం అశోక్ తో మరో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా పోటీ పడుతున్నప్పటికీ చంద్రబాబు మొగ్గు మాత్రం క్లియర్ గానే ఉన్నట్లు సమాచారం.
వచ్చే నెలలో నాలుగురాష్ట్రాల గవర్నర్ల పేర్లను కేంద్రం ప్రకటించే అవకాశాలున్నాయి. ఇందులో తమిళనాడు గవర్నర్ బీఎన్ రవిని మార్చే అవకాశం ఉంది. ఆయన స్ధానంలో అశోక్ గజపతిరాజుకు ఛాన్స్ దక్కుతుందని తెలుస్తోంది. గతంలో తమిళనాడు గవర్నర్ గా రోశయ్య వంటి వారు పనిచేశారు. ఇప్పుడు అశోక్ ను తమిళనాడు గవర్నర్ గా నియమిస్తే తెలుగు రాష్ట్రాల వారికి అక్కడ మరో అవకాశం లభించినట్లవుతుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన అశోక్ కు గవర్నర్ పదవి లభిస్తే కెరీర్ చరమాంకంలో ఆయనతో పాటు టీడీపీకి కూడా గౌరవంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications