జాగ్రత్త!: రేవంత్ కేసులో బాబు పాత్రపై కెసిఆర్కు గవర్నర్ సూచన
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని గవర్నర్ నరసింహన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు సూచించినట్లు సమాచారం. రేవంత్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు అదుపులోకి తీసుకున్న తర్వాత జూన్ 1వ తేదీన కెసిఆర్ గవర్నర్ను కలిశారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డి అరెస్టుపై కెసిఆర్ గవర్నర్కు వివరించినట్లు తెలుస్తోంది.
చంద్రబాబును నిందితుడిగా చేరిస్తే ఎదురయ్యే పరిణామాలపై కూడా జాగ్రత్తగా ఆలోచించాలని, తొందర పడవద్దని గవర్నర్ తెలంగాణ ముఖ్యమంత్రికి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. ఈ కేసు విషయంలో ఎసిబి డైరెక్టర్ జనరల్ ఎకె ఖాన్ కూడా గవర్నర్ను కలిశారు. గవర్నర్ నరసింహన్ ఎకె ఖాన్తోనూ అదే విషయం చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితిలో చంద్రబాబు పేరును నిందితుల జాబితాలో చేర్చకూడదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, విచారణకు మాత్రం హాజరు కావాలని చంద్రబాబుకు సమన్లు జారీ చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించిన తర్వాత చంద్రబాబుకు సమన్లు జారీ చేసే విషయం ఆలోచించాలని ఎసిబి అధికారులు అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
తిరుగులేని సాక్ష్యాలు ఉంటే తప్ప చంద్రబాబును కేసులోకి లాగవద్దని గవర్నర్ చెప్పినట్లు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిని నిందితుల జాబితాలో చేర్చడం వల్ల అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చునని కెసిఆర్తో గవర్నర్ అన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును కేసులోకి లాగడం వల్ల తలెత్తే పరిణామాలపై కెసిఆర్ ఎకె ఖాన్తో విస్తృతంగా చర్చించినట్లు చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి శాసనసభ్యుడు స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనేది తెలుసుకోవడానికి ఎసిబి అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డిని ప్రధానంగా ఎసిబి ఈ విషయంలో విచారించే అవకాశం ఉందని అంటున్నారు. ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలించి రేవంత్ రెడ్డిని ఆ విషయంలో ప్రశ్నించాలని ఎసిబి అధికారులు భావిస్తున్నారు.