పీఆర్సీపై రేపు చర్చలు- జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీట్ కు నిర్ణయం : అందులో ఫైనల్..!!
ఉద్యోగ సంఘాల ఆందోళనతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఆర్సీ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దాని కంటే ముందుగా పీఆర్సీ నివేదిక తమకు ఇవ్వాలని కోరుతూ బుధవారం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పీఆర్సీ నివేదిక ఉద్యోగ సంఘాలకు అందించే అంశం పైన సీఎస్ హామీ ఇచ్చారు. దీంతో.. బుధవారం సీఎస్ ను కలిసిన తరువాత తమకు పీఆర్సీ నివేదిక ఇవ్వాలంటూ అయిదున్నార గంటలు సచివాలయంలోనే నిరీక్షించారు.

మరోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
ప్రభుత్వం అక్టోబర్ నెలాఖరుకే పీఆర్సీ అంశాన్ని క్లియర్ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ, అది అమలు కాలేదు. దీంతో..ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో..జేఏసీ నేతలకు జీఏడీ కార్యదర్శి శశిభూషణ్ ఫోన్ చేశారు. ఉద్యోగ సంఘాల ప్రస్తావిస్తున్న అన్ని అంశాల మీద చర్చించటానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పుకొచ్చారు. పీఆర్సీ పైన ఏర్పాటు చేసిన అశుతోష్ మిశ్ర కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి చాలా కాలం అవుతోంది. అయితే, జగన్ సీఎం అయిన తరువాత ఉద్యోగులకు అప్పటికే ఇచ్చిన హామీ మేరకు 27 శాతం మధ్యంతర భృతి ప్రకటించి అమలు చేస్తున్నారు.

ఆ మీటింగ్ లోనే పీఆర్సీపై చర్చ
ఇక, ఇప్పుడు ఉద్యోగ సంఘాల ఒత్తిడి పెరగటంతో శుక్రవారం మధ్నాహ్నం ఏపీ ప్రభుత్వం తిరిగి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో అన్ని అంశాలు చర్చిద్దామంటూ ప్రభుత్వం ప్రతిపాదించింది. పీఆర్సీతో పాటుగా ఫిట్ మెంట్.. డీఏలు.. సీపీఎస్ పైన చర్చించే అవకాశం ఉంది. అయితే, ఉద్యోగ సంఘాలు కోరుతున్నట్లుగా పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇస్తారా.. లేక ప్రభుత్వమే వారికి అందులోని అంశాలను బ్రీఫ్ చేస్తుందా అనేది చూడాల్సి ఉంది.

27 శాతం అంటున్న ప్రభుత్వం
అందులో ఎలాంటి ప్రతిపాదనలు ఉన్నా.. ఉద్యోగ సంఘాలు మాత్రం తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాయి. తెలంగాణలో 30 శాతం పీఆర్సీ అమలు చేస్తుండటంతో.. అంతకంటే ఎక్కువ సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం ఇప్పుడు మధ్యంతర భృతి గా ఇస్తున్న 27 శాతాన్ని ఫిట్ మెంట్ గా ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. రాష్ట్రంలో ఉన్న ఆర్దిక సమస్యలను పరిగణలోకి తీసుకొని సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది. సీఎస్ స్థాయిలో ఉద్యోగ సంఘాలతో శుక్రవారం చర్చలు జరిగిన తరువాత..దాని పైన అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనున్నారు.

ముఖ్యమంత్రి వద్ద తుది చర్చలకు ఛాన్స్
ఆ తరువాత అవసరమైతే ముఖ్యమంత్రి నేరుగా ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం అవుతారు. ఆ సమయంలో పీఆర్సీ పైన తుది నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక, సచివాలయంలో ఉద్యోగ నేతలు రాత్రి వరకు వెయిట్ చేయటం... ఉద్యోగ సంఘ నేత ప్రభుత్వం పైన చేసిన వ్యాఖ్యలు పైన ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో..ఆ సంఘంతో సచివాలయ ఉద్యోగ సంఘం విభేదించింది. పీఆర్సీ నివేదిక ఇచ్చే వరకు తాము పీఆర్సీ పైన మాట్లాడబోమని స్పష్టం చేసింది.

శుక్రవారం సమావేశంలో పీఆర్సీ అంశాలు..ప్రతిపాదనలు
ఇక, ఈ రోజున సమావేశమై తమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పిన ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం మధ్నాహ్నం ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయటంతో..ఆ చర్చల తరువాత తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే, ప్రభుత్వ సలహాదారు సజ్జల మాత్రం ఇప్పటికే పీఆర్సీ పైన కసరత్తు మొదలైందని వ్యాఖ్యానించారు. దీంతో..త్వరలోనే ఈ మొత్తం వ్యవహారానికి ముగింపు లభించే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో..జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషన్ కుమార్ తో ఏపీజేఎసి, ఏపీజేఎసి అమరావతి ఛైర్మన్ లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు సమావేశమయ్యారు. ఈ రోజున పీఆర్సీ నివేదిక అందించాలని కోరారు.












Click it and Unblock the Notifications