ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ పై వేటుకు రంగం సిద్దం..! విజిలెన్స్ విచారణ మొదలు: ప్రభుత్వం సీరియస్..!
సినీ నటుడు..ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ పై వేటు తప్పేలా లేదు. వెలుగులోకి వచ్చిన పృథ్వీ ఆడియో వ్యవహారం..స్థానికంగా వస్తున్న ఆరోపణపైన ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ విచారణ ప్రారంభించింది. రెండు రోజుల క్రితం అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులు..వారి సామాజిక వర్గం గురించి విమర్శలు చేయటం పైన వైసీపీ అధినాయకత్వం సీరియస్ అయింది. కులాల ప్రస్తావన చేస్తే చర్యలు తప్పవని హెచ్చ రించింది. ఇక, ఇప్పుడు ఒక ర్ట్ టైమ్ ఉద్యోగినితో ఆయన ఫోన్లో సాగించిన సంభాషణ పైన ప్రభుత్వం సీరియస్ గా ఉంది. విజిలెన్స్ నివేదిక రాగానే ఆయన తప్పు తేలితే ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుండి తప్పిం టచం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఇదంతా కుట్ర పూరితంగా చేస్తున్నారని..తాను చెప్పచేయలేదని పృథ్వీ టీటీడీ ఛైర్మన్ కు వివరణ ఇచ్చినట్లు సమాచారం.
పృథ్వీ పై విజిలెన్స్ విచారణ..
ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ రాజ్.. ఎస్వీబీసీ ఛానెల్లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగినితో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. అమరావతి రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. అందరిచేత విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన.. ఇప్పుడు తన స్థాయిని మరిచి చాలా అసహ్యంగా మాట్లాడి..కొత్త వివాదంలో చిక్కుకున్నారు. అదే సమయంలో ఎస్వీబీసీ ఉద్యోగ సంఘ నేతలు సైతం ఆయన తీరు పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. పద్మావతి భవన్ లోనే ఆయన మద్యం సేవించే వారంటూ తీవ్రంగా విమర్శలు చేసారు. దీంతో..టీటీడీలో ఎస్వీబీసీ సైతం భాగం కావటం..పృథ్వీ ఛైర్మన్ గా ఉండటతో ఆయన పైన వెంటనే విజిలెన్స్ విచారణ మొదలైంది. ఈ సాయంత్రానికి ప్రాధమిక నివేదిక టీటీడీ ఛైర్మన్ కు అందనుంది.
వేటు తప్పేలా లేదు...
పృథ్వీ వ్యవహార తీరు కొద్ది కాలంగా వివాదాస్పదంగా మారుతోంది. ఆయన తన సంస్థలో ఉద్యోగుల నియామకాల్లోనూ ఇష్టానుసారం వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. దీని పైన టీటీడీ ఛైర్మన్ కు ఫిర్యాదు లు వెళ్లగా..ఆయన వివరణ కోరారు. అందులో కొందరిని తొలిగించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో ఎస్వీబీసీకి సంబంధించి ఆయన ఏ రకంగానూ తన సమర్ధత నిరూపించుకోలేకపోయారనే అభిప్రాయం ఉంది. ఇక, తాజాగా రాజధాని అమరావతి రైతుల ఆందోళన విషయంలో వారి సామాజిక వర్గాల గురించి ప్రస్తావించటం వివాదాస్పదమైంది. దీనికి పోసాని సైతం తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. దీంతో..వైసీపీ అధినా యకత్వం కులం పేరుతో ఎవరైనా విమర్శలు చేస్తే చర్యలు తప్పవని చెబుతూనే..పృథ్వీ పైనున పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని ఆలోచన చేస్తున్న సమయంలోనే ఇప్పుడు ఈ ఆడియో బయటకు వచ్చింది. దీంతో..పృథ్వీ పైన వేటు వేయటం ఖాయమని తెలుస్తోంది.
తన మీద కుట్ర అంటూ..
తన పేరుతో వైరల్ అవుతున్న వీడియో తన మీద వ్యతిరేకంగా ఒక వర్గం చేస్తున్న కుట్రగా పృథ్వీ చెబుతున్న సమాచారం. నేరుగా ఈ వ్యవహారం పైన టీటీడీ ఛైర్మన్ కు ఫిర్యాదులు రాగానే..ఆయన దీని పైన వాకబు చేసే ప్రయత్నం చేసారు. అయితే, తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అని..తాను ఎటువంటి తప్పు చేయలేదంటూ పృథ్వీ వివరణ ఇచ్చుకొనే ప్రయత్నం చేసారని సమాచారం. అయితే ఈ సాయంత్రానికి విజిలెన్స్ నివేదిక అందగానే..అందులోని విషయాన్ని సీఎంకు వివరించి చర్యలు తీసుకోవటానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. టీటీడీ విషయంలో రాజకీయంగా ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటికి ప్రభుత్వం..టీటీడీ సమాధానం చెప్పుకొచ్చాయి. కానీ, ఇప్పుడు పృథ్వీ పైన చర్యలు తీసుకోకుంటే..సమస్యలు తప్పవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో..దీని పైన ఇప్పటికే సీరియస్ గా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.