ఏపీ ఉద్యోగుల ముందు సీపీఎస్ బదులు ‘జీపీఎస్’: సర్కారు ప్రతిపాదనపై ఉద్యోగులు ఏమన్నారంటే..?
అమరావతి: ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) రద్దు అంశంపై చర్చిందుకు ఏపీ ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీని ఏర్పాటు చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సీపీఎస్ అంశంపై చర్చించేందుకు సోమవాంర సచివాలయంలో సోమవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఉన్నతాధికారులు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఉద్యోగ సంఘాల నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

సీపీఎస్ బదులు జీపీఎస్ ప్రతిపాదన.. నేతలు ఇలా
సమావేశంలో సీపీఎస్ రద్దు అంశంపై ప్రధానంగా చర్చించారు. సీపీఎస్ బదులుగా జీపీఎస్ ను ప్రతిపాదించింది ప్రభుత్వం. గ్యారెంట్ పెన్షన్ స్కీమ్(జీపీఎస్)ను ఉద్యోగ సంఘాల ముందు ఉంచింది ఏపీ సర్కారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన జీపీఎస్పై ఉద్యోగ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. కొత్త స్కీం నమ్మదగినదిగా లేదని ప్రభుత్వానికి చెప్పామని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. పీఆర్సీ చర్చల్లో ఇచ్చిన హామీలు అమల్లోకి రాకపోవడంపై.. కమిటి దృష్టికి తీసుకెళ్లామని బండి శ్రీనివాసరావు చెప్పారు. పాద విధానమే కావాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.

సీపీఎస్పై కీలక మంత్రులతో ప్రభుత్వ కమిటీ
సీపీఎస్పై ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్, సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉన్నారు. వివిధ ఉద్యోగాల సంఘాలతో మంత్రుల కమిటీతో చర్చించిన తర్వాత తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.

ముట్టడి పిలుపుతో విజయవాడలో ఉద్రిక్తత.. సామాన్యులకు ఇబ్బందులు
ఇక 2022, ఏప్రిల్ 25వ తేదీ సోమవారం సీపీఎస్ రద్దు కోరుతూ యూటీఎఫ్ నేతలు చేపట్టిన ఆందోళనతో విజయవాడలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారింది. పోలీసుల ఆంక్షలు విధించినా భారీగా ఉపాధ్యాయులు విజయవాడకు తరలివచ్చారు. సీఎం క్యాంప్ ఆఫీస్ వైపు వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే.. ఎక్కడి వారిని అక్కడ పోలీసులు అరెస్ట్ చేసి.. యూటీఎఫ్ ఆందోళనలను అడ్డుకున్నారు. యూటీఎఫ్ ముట్టడి పిలుపు కారణంగా విజయవాడలో పోలీసులు విధించిన ఆంక్షలతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. తెల్లవారుజాము నుంచే అన్ని కూడళ్లలో భారీగా పోలీసులు మోహరించారు. బస్సులు, రైళ్లలో విస్తృతంగా తనిఖీలు చేశారు. సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లే దారిలోనే 650 మంది పోలీసులను మోహరించి.. బారికేడ్లు పెట్టారు. స్థానికులను కూడా వదలకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.












Click it and Unblock the Notifications