ఆ జిల్లాలో పవన్ కల్యాణ్ పండగ సందడి
Pawan Kalyan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
ఈ క్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓ అడుగు ముందుకేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో కూడా గ్రామసభలను నిర్వహించాలని నిర్ణయించారు. నేడు రాష్ట్రంలో గల మొత్తం 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామసభలను నిర్వహించబోతోన్నారు.

దీనికి సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యాయి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభలను నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. దీనికి అవసరమైన విధి విధానాలను ఆయా మంత్రిత్వ శాఖలు ఇదివరకే ఖరారు చేశాయి.
ఆయా పంచాయతీల్లో 4,500 కోట్ల రూపాయిల అంచనా వ్యయంతో మొత్తంగా 87 రకాల పనులకకు గ్రామ సభల ద్వారా ఆమోదం తెలుపనున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందడానికి ఏకంగా తొమ్మిది కోట్ల పని దినాలను కల్పించడం, దీని ద్వారా 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించడం వీటి ఉద్దేశం. వాటన్నింటిపైనా గ్రామ సభల్లో తీర్మానాలు చేయనున్నారు.
జిల్లా, మండలం, గ్రామ స్థాయి వరకు ఉన్న అధికారులందరూ కూడా ఈ పథకం కింద చేపట్టిన పనులను అమలు చేయడం, సకాలంలో పూర్తి చేయడంలో బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఉపాధి హామీ కింద వంద రోజుల పని దినాలను ఖచ్చితంగా కల్పించేలా అన్ని గ్రామ సభల్లోనూ తీర్మానాలను ఆమోదించేలా చర్యలు తీసుకున్నారు.
ఆయా తీర్మానాల్లో పొందుపర్చాల్సిన అంశాలు, అర్హులైన ప్రతి లబ్దిదారుడు, ప్రతి కుటుంబానికీ ఉపాధి హామీ పథకం కింద సంవత్సరంలో 100 రోజుల పని దినాలను కల్పించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించారు. ఆయా పనులన్నీ గ్రామసభల సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టాల్సిన పనుల ఆమోదం, వేతనాలను కోరే హక్కు, అర్హతల గురించి ప్రజలకు వివరించడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన పనులపై అక్కడికక్కడే సమీక్షించడం వంటివి ఈ గ్రామసభల్లో చర్చిస్తారు.
ఈ గ్రామసభల్లో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. గ్రామసభల ప్రారంభ తేదీ అయిన 23వ తేదీన అన్నమయ్య రాయచోటి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మైసూరావారి పల్లిలో నిర్వహించే గ్రామసభకు హాజరు కానున్నారు. అనంతరం రాజంపేట అన్నమయ్య డ్యాం వరద బాధిత గ్రామమైన పులపుత్తూరుకు వెళ్తారు.












Click it and Unblock the Notifications