పురుటి బిడ్డను నదిలో పడేసిన అమ్మమ్మ
అనంతపురం: ఓ మహిళ అత్యంత దారుణమైన పనికి ఒడిగట్టింది. పెంచడం భారమనుకుని పురిటిబిడ్డను అమ్మమ్మనే పెన్నానదిలోకి విసిరేసింది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
మునీంద్ర భార్య చౌడమ్మ ప్రసవానికి తాడిపత్రి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. శుక్రవారం తెల్లవారుజామున చౌడమ్మ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అప్పటికే వారికి ఇద్దరు అమ్మాయిలు ఉండటం మూడో కాన్పులో మరో పాప పుట్టడంతో బిడ్డను పెన్నానదిలో విసిరేయమని తన తల్లి అచ్చమ్మకు అప్పగించింది.
పెన్నానది కరకట్టపై నుంచి దాదాపు 15 అడుగుల లోతులో ఉన్న ముళ్ళపొదల్లోకి పాపను విసిరేసి వెళ్లిపోయింది. ఇంతలో అటుగా వచ్చిన పందుల పెంపకందారులు చిన్నారిని చూసి మునిసిపాలిటీ అధికారులకు చెప్పడంతో వారు 108లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పైనుంచి విసిరేయడం వల్ల పాప తలకు తీవ్రగాయమైంది. పాప బొడ్డుకు వేసిన క్లిప్ ఆధారంగా ఏ ఆసుపత్రిలో కాన్పు జరిగిందో గుర్తించినట్లు వైద్యాధికారి పుల్లయ్య తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులను విచారించిన పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు.