జీఎస్టీ 2.0 బిగ్ జోక్..! జనం సొమ్ముతో మోడీ భజనా ? షర్మిల పైర్..!
ఏపీలో జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రచారం కోసం రేపు ప్రధాని మోడీ కర్నూలు రానుండటంపై పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. మోడీ జీఎస్టీ 2.O ఉత్సవ్ ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్ అన్నారు. గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్టీ ) పేరుతో 2017-18 నుంచి 2024-25 మధ్య 8 ఏళ్లలో దోపిడీ చేసింది రూ.55,44,897 కోట్లని, ఇప్పుడు 2.O సంస్కరణల పేరుతో తగ్గించింది రూ.2.5 లక్షల కోట్లని షర్మిల గుర్తుచేశారు. ఇన్నాళ్లు ఎడాపెడ పన్నుల మోత మోగించి, సామాన్యుల నడ్డి విరిచిన మోడీ.. గోరంత ట్యాక్సులు తగ్గించి కొండంత చెప్పుకుంటున్నారన్నారు.
జీఎస్టీ తగ్గింపుతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందనేది పచ్చి అబద్ధమని షర్మిల ఆరోపించారు. ఆత్మనిర్భరత,నవశకం, నవతరం అనేది అంతా బూటకమన్నారు. ఉత్సవాల పేరిట సభలు నిర్వహించడం హాస్యాస్పదమని తెలిపారు. రేపటి కర్నూల్ సభకు 7వేల బస్సులట, 5 లక్షల మంది జనసమీకరణ చేస్తారట అంటూ సెటైర్లు వేశారు. ప్రజల సొమ్ముతో మోడీ సొంత భజన చేయడానికి కూటమి ప్రభుత్వానికి సిగ్గుండాలన్నారు. స్వల్పకాలిక జీఎస్టీ పన్నుల సవరణతో ఏపీ ప్రజలకి తగ్గిన ట్యాక్సుల భారం రూ.8వేల కోట్లు మాత్రమేనన్నారు. ఇది ఎంతమాత్రం ప్రజలకు ఉపశమనం కాదన్నారు.

ఏపీకి, ప్రజలకు న్యాయం జరగాలంటే కావాల్సింది జీఎస్టీ ఉత్సవాలు కాదు.. ప్రత్యేక హోదా అన్నారు. హోదానే రాష్ట్ర అభివృద్ధికి సంజీవని అని షర్మిల తెలిపారు. హోదాతోనే పరిశ్రమలు, భారీగా పన్ను రాయితీలు, నిరుద్యోగులకు లక్షల్లో ఉద్యోగాలు వస్తాయన్నారు. 2014లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా అమలైవుంటే నేడు దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉండేదన్నారు.

రేపు కర్నూల్ జిల్లాలో జీఎస్టీ 2.0 ఉత్సవ సభకు వస్తున్న మోడీని ప్రత్యేక హోదా ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. తిరుపతి వేదికగా ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి తప్పారని, రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి హోదా అంశాన్ని దాటేస్తున్నారని ఆరోపించారు. విభజన హామీలపై సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. కనీసం ఈసారైనా ప్రత్యేక హోదా ప్రకటన చేయాలన్నారు. లేకుంటే హోదాపై బీజేపీ వైఖరి ఏంటో తేల్చాలన్నారు.












Click it and Unblock the Notifications