ఉన్మాదుల చేతుల్లో టిడిపి, చంద్రబాబునైనా ఢీకొంటా: ఈదర హరిబాబు
ఒంగోలు: రాజకీయ ఉన్మాదుల చేతుల్లో తెలుగుదేశంపార్టీ ఉందని, ఆ పార్టీని కాపాడటం కోసం ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుతోనైనా ఢీకొంటానని ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు అన్నారు. బుధవారం స్థానిక జిల్లాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ ఉన్మాదులు ఫలితంగానే జిల్లాపరిషత్లో రాజకీయ సంక్షోభం వచ్చిందన్నారు.
రాజకీయ ఉన్మాదుల చేతుల్లోనుండి పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తనను తెలుగుదేశంపార్టీనుండి సస్పెండ్ చేసే అధికారం ఎవరికి లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టిడిపి అంటే ఎన్టీఆర్దేనని, టిడిపి అంటే జిల్లాలో ఈదరేనని ఆయన స్పష్టం చేశారు. తాను పార్టీలోనే కొనసాగుతానని రెండవ ఆలోచన తనకు లేదని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా పరిషత్ను అవినీతి రహిత పరిషత్గా తయారుచేస్తానని ఆయన వెల్లడించారు. జిల్లాపరిషత్ 14నెలల సంక్షోభకాలం, అధికారుల పనితీరు, సుప్రీంకోర్టు జడ్జిమెంటుతోపాటు పలు అంశాలను వెబ్సైట్లో ఉంచనున్నట్లు చెప్పారు. మరోనాలుగు, ఐదురోజుల్లోనే ఈ వెబ్సైట్ను ప్రారంభించి అన్నిఅంశాలను పొందుపరుస్తామన్నారు.

తనకు న్యాయవ్యవస్థపై అపారమైన నమ్మకం ఉందని,న్యాయపోరాటంలో నిజమే గెలిచిందని ఆయన వెల్లడించారు. అవినీతి అంటే తనకు అసహనమని, అవినీతిపై గతంలోనే యుద్దంచేశానని ఆయన తెలిపారు. జిల్లాపరిషత్ను అవినీతి రహితంగా చేసేవిధంగా ఏలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశాలపై చర్చిస్తున్నట్లు చెప్పారు. జిల్లాపరిషత్లో అవినీతికి అవకాశం లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని ఆయన తెలిపారు.
జిల్లా సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన ఆయన తెలిపారు. తనకు జిల్లాలోని శాసనసభ్యులందరు సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. ముఖ్యంగా ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ కూడా తనకు సహకారాన్ని అందిస్తారని ఆశిసున్నట్లు జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications