‘ఆ భయంతోనే చంద్రబాబు మొహం చాటేశారు! ఆర్థిక ప్యాకేజీతో పవన్ కళ్యాణ్ మౌనం’
అమరావతి: ఐటీ శాఖ ఇచ్చిన ప్రెస్ నోట్ను క్షుణ్ణంగా చదివితే అసలు బండారం బయటపడుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు అదే భయం..
తన మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ శాఖ జరిపిన సోదాలపై చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. రూ. 2వేల కోట్ల కోట్ల అవినీతి జరిగిందని ఆదాయపుపన్ను శాఖ తన ప్రకటనలో తెలిపినా.. చంద్రబాబు మౌనంగా ఎందుకు ఉన్నారని ఆయన నిలదీశారు. తన బినామీలకు చెందిన ఆస్తులు బయటపడిపోతాయనే భయంతోనే ప్రజలకు చంద్రబాబు మొహం చూపడం లేదని విమర్శించారు.

టీడీపీ నేతలు దమ్ముంటే ఆ పని చేయండి...
రూ. 2వేల కోట్ల అవినీతి జరిగినట్లు ఐటీ శాఖ ఇచ్చిన ప్రకటనలో నిజం లేదని చెబుతున్న టీడీపీ నేతలు.. దమ్ముంటే సోదాలు జరిపిన ఐటీ శాఖపై పరువునష్టం దావా వేయాలని డిమాండ్ చేశారు. రూ. 2వేల కోట్ల అవినీతి జరిగినట్లు ఐటీ శాఖ ప్రకటనలో స్పష్టంగా ఉందని, పలు బినామీ సంస్థలు నిధులు మళ్లించారని అమర్నాథ్ చెప్పారు. టీడీపీ నేతలకు మాత్రం అవేమీ కనిపించడం లేదన్నారు. యనమల రామకృష్ణుడుకు పంటి నొప్పితోపాటు కంటి చూపు కూడా పోయిందని, ఐటీ ప్రెస్ నోట్ ఇచ్చింది వైఎస్సార్సీపీ కాదని.. కేంద్ర ఐటీ శాఖ అని అన్నారు.

సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా?
తమపై పరువునష్టం దావా వేస్తే.. గతంలో జగన్మోహన్ రెడ్డిపై అవాస్తవాలు ప్రచారం చేసినందుకు తామూ తిరిగి టీడీపీ నేతలపై పరువు నష్టం దవా వేస్తామన్నారు. చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని టీడీపీ నేతలకు అమర్నాథ్ సవాల్ విసిరారు. ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే అవసరం వైసీపీకి లేదని అన్నారు. పొత్తుల కోసం తాము వెంపర్లాడటం లేదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామనే పార్టీతోనే పొత్తు పెట్టుకుంటామనే విషయాన్నిఎన్నికల ముందే చెప్పామని అన్నారు.

పవన్ కళ్యాణ్కు చంద్రబాబు ప్యాకేజీ
మరో వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలు లక్ష్యంగా విమర్శలు చేశారు. అమరావతి అంశంపై పదే పదే మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఏమయ్యారని ప్రశ్నించారు. తన మాజీ పీఎస్ శ్రీనివాస్పై ఐటీ శాఖ దాడులు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు మీడియా ముందుకు రాలేదన్నారు. చంద్రబాబు నుంచి ఆర్థిక ప్యాకేజీ తీసుకున్నారు కాబట్టే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఐటీ దాడులపై నోరు మెదపడం లేదని అన్నారు. చంద్రబాబు భజనపరులు తమ నాయకుడి మెప్పు కోసం ఐటీదాడులపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications