'జగన్కు షాక్, త్వరలో కృష్ణాలో ఖాళీ': కొడాలి నాని బుజ్జగించినా.. 'అధికారం' రివర్స్
విజయవాడ: త్వరలో కృష్ణా జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆదివారం నాడు అన్నారు. జిల్లాకు చెందిన పలువురు వైసిపి ముఖ్య నేతలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు.
వైయస్ జగన్, కొడాలి నాని తీరుతో పలువురు టిడిపిలో చేరుతున్నారన్నారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సెలర్లు టిడిపిలో చేరడం శుభసూచకమన్నారు.
జిల్లాలోని గుడివాడ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాస రావు, 9 మంది కౌన్సెలర్లు ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరారు. దీంతో కృష్ణా జిల్లాలో వైసిపికి గట్టి ఎదురుదెబ్బ తిగిలింది.
జగన్, కొడాలి నానిలకు ఝలక్: టిడిపిలో చేరుతామని చెప్పిన కుడిభుజం
ఈ చేరిక కార్యక్రమంలో ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నాని, టిడిపి నేతలు రావి వెంకటేశ్వర రావు, వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, తొలుత చైర్మన్, మరో ఏడుగురు కౌన్సిలర్లు చేరుతారని భావించారు. కానీ 9 మంది కౌన్సెలర్లు చేరడం గమనార్హం. నాని వల్లే పార్టీని వీడుతున్నామని చైర్మన్ యలవర్తి శ్రీనివాస రావు చెప్పారు. వైసిపి ఒంటెద్దు పోకడలు, వ్యవహారశైలి నచ్చకే తాను బయటకు వచ్చానన్నారు.
అధికారం రివర్స్!
గుడివాడ పురపాలక కౌన్సిల్ టిడిపి కైవసం చేసుకునే దిశగా రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గుడివాడ పురపాలక కౌన్సిల్లో వైసిపికి 21 మంది సభ్యుల బలం ఉండగా టిడిపికి 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం వైసిపికి చెందిన కౌన్సిలర్ గణపతి లక్ష్మణరావు చనిపోయారు. దీంతో ఆ పార్టీ బలం బలం 20కి చేరింది.
ప్రస్తుతం కౌన్సిలర్లు పార్టీ మారడంతో టిడిపి బలం పదిహేను నుంచి 25కు చేరింది. అదే సమయంలో వైసిపి సభ్యుల బలం పదికి పడిపోయింది. దీంతో గుడివాడ పురపాలక కౌన్సిల్ టిడిపి వశం కానుంది. కౌన్సిలర్లను టిడిపిలోకి వెళ్లనీయకుండా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రయత్నం చేశారు. వారిని బుజ్జగించినా, అవి విఫలమయ్యాయి.