తెల్లదొరలకు ఎదురునిలిచి.. ప్రాణాలర్పించిన యోధురాలు గున్నమ్మ!
సిక్కోలు అంటే పోరాటాల పురిటిగడ్డ. అలాంటి నేలపై తెల్లదొరలను ఎదిరించి.. నెత్తురు చిందించిన యోధుల విజయగాథను జ్ఙప్తికి తెచ్చుకోవాల్సిన సమయమిది. బ్రిటీష్వారి కబందహస్తాల్లో నలిగిపోతున్న మన హక్కులకు విముక్తి కలిగించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన వీరులను గుర్తుకు తెచ్చుకోవాల్సిన సమయమిది. సిక్కోలు గడ్డపై తెల్లదొరలకు ఎదురు నిలిచి గర్జించిన వీరవనిత మన గున్నమ్మ గురించి తెలుసుకోవాల్సిన సమయమిది!
బ్రటీష్ తెల్లదొరల పాలనలో దేశ ప్రజలు నలిగిపోతున్న కాలమది. అప్పటికే దేశ స్వాతంత్య్రపోరాటం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఈ బానిస సంకెళ్లను తెంచుకునేందుకు గ్రామీణ ప్రాంత ప్రజల్లోనూ చైతన్యం కలుగుతోంది. అలాంటి సమయంలోనే శ్రీకాకుళం జిల్లా మందస మండలం గుడారిరాజమణిపురం రైతులు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఆ రోజుల్లో రైతులు పండించిన పంటలో మూడో వంతు జమిందారులకు శిస్తు కట్టాలనే నిభందన ఉండేది. అందుకోసం రైతులనుంచి బలవంతంగా శిస్తు వసూళు చేసేవారు. తమ కష్టాన్ని తెల్లదొరలు దోచుకుంటున్నారని రైతులు రగిలిపోయారు. పోరాడితేనే తమ బానిస సంకెళ్లకు విముక్తి దొరుకుతుందని భావించారు. రైతులంతా ఒక్కటయ్యారు. ఆ రైతుల కూటమిలో గున్నమ్మ కూడా ఉన్నారు. అప్పటికి ఆమె నిండు గర్భిణి.

కట్టలు తెంచుకున్న ఆగ్రహం..
తమ నిర్ణయాన్ని అమలు చేసేందుకు మందస ఎస్టేటు పరిధిలోని అడవుల నుంచి నాటుబళ్లపై కలప తెచ్చుకునేందుకు ఒక్కటిగా బయలుదేరారు. అనుకున్నట్లుగానే అడవుల నుంచి నాటుబళ్లపై కట్టెలతో గ్రామంలో అడుగుపెట్టారు. అయితే, ఆ విషయం అప్పటి మందస ఎస్టేట్ దివాను రామకృష్ణదేవ్ చెవిన పడింది. వెంటనే విషయాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి చేరవేశారు. దీంతో డీఎస్పీ మునిలాల్ పోలీసు బలగాలతో గుడారిరాజమణిపురం గ్రామానికి చేరుకున్నారు. కొందరు రైతులను అదుపులోకి తీసుకుని, అరెస్టు చేశారు. దీంతో అక్కడి రైతుల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంది. మూకుమ్మడిగా పోలీసులపై తిరగబడి అరెస్టయినవారిని విడిపించారు.

సివంగిలా దూకిన గున్నమ్మ..
అది 1940 ఏప్రిల్ 1. గుడారిరాజమణిపురం గ్రామానికి సబ్కలెక్టరు చక్రవర్తి అదనపు పోలీసు బలగాలతో చేరుకున్నారు. చర్చల పేరుతో రైతులను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్నగున్నమ్మ వారిని అరెస్టు చేసేందుకు బ్రిటీష్ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతుందని గ్రహించారు. రెప్పపాటులో పోలీసులపై సివంగిలా దూకింది. ఎదురు వస్తున్నవారిని నెట్టుకుంటూ ముందుకెళ్లింది. గున్నమ్మను పోరాటం అక్కడి రైతుల్లో మరింత స్పూర్తిని నింపింది. అందరూ ఏకమయ్యారు. కర్రలతో పోలీసులను ఎదిరించారు. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు తుపాకులకు పనిచెప్పారు. గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా అక్కడివారెవ్వరూ బెదరలేదు. దీంతో విచక్షణ మరిచిన ఆ పోలీసులు రైతులపై తుపాకీ గురిపెట్టారు. ఆ తూటాలకు ఎదురునిలిచిన నిండు గర్భిణి గున్నమ్మ అక్కడే నేలకొరిగింది. ఆమెతోపాటు రైతులు గొర్లె జగ్గయ్య, గుంట బుడియాడు, కర్రి కలియాడు, గుంట చిననారాయణలు తమ ప్రాణాలను అర్పించారు. 1988లో గవర్నరు శ్రీమతి కముద్బెన్జోషి ఆ గ్రామాన్ని సందర్శించారు. గున్నమ్మ ప్రాణాల్పించిన స్థలంలోనే స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. అంతేకాదు, ఆ గ్రామానికి వీరగున్నమ్మపురంగా నామకరణం చేసి ప్రభుత్వ గెజిట్లో మార్పు చేశారు. గున్నమ్మ త్యాగానికి గుర్తుగా గ్రామానికి వెళ్లే మార్గంలో పోరాట చిహ్నాలతో సింహద్వారాన్ని నిర్మించారు. సిక్కోలు ప్రజల గుండెల్లో గున్నమ్మ అంటే ఓ పోరాటం అని భావిస్తారు.












Click it and Unblock the Notifications