20 ఏళ్ళ పగ.. గుంటూరులో పట్టపగలే నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపిన శత్రువులు!
సమాజంలో వివిధ సందర్భాలలో ఒకరిపై ఒకరికి పెరిగిన కక్షలు, కార్పణ్యాలు దారుణ హత్యలకు కారణం అవుతున్నాయి. తాజాగా అటువంటి దారుణమే జరిగింది. 20 ఏళ్ళ క్రితం జరిగిన ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి కోర్టులో కేసు కొట్టేయటంతో బయటకు వచ్చి వేరే ప్రాంతంలో జీవనం సాగిస్తున్నాడు. అయితే తాజాగా మళ్ళీ ఆ వ్యక్తి గుంటూరు రావటంతో పగతో రగిలిపోయిన శత్రువులు పట్టపగలు దారుణ హత్యకు పాల్పడ్డారు.
20 ఏళ్ల పాత కక్షల నేపధ్యంలో వ్యక్తి హత్య
వివరాలలోకి వెళితే గుంటూరులోని కెవిపి కాలనీలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. 20 ఏళ్లుగా కొనసాగుతున్న పాత కక్షల నేపథ్యంలో చిన్నా అనే వ్యక్తిని ప్రత్యర్థులు కర్రలు, కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఉదయం పది గంటల సమయంలో టీ తాగేందుకు రోడ్డుపైకి వచ్చిన చిన్నాపై బైక్పై వచ్చిన కొందరు దాడి చేశారు. మొదట కర్రలతో కొట్టి, తర్వాత కత్తులతో నరికి చంపేశారు.

భార్యతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి హత్య .. నిందితుడు బయటకు
ఈ వార్త తెలిసి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని విలపించారు. ఇరవై ఏళ్ల క్రితం అదే కాలనీలో చిన్నా, బుల్లయ్య మధ్య వివాదం జరిగింది. చిన్నా భార్యతో బుల్లయ్య సన్నిహితంగా ఉన్నాడన్న ప్రచారం నేపథ్యంలో బుల్లయ్య హత్యకు గురయ్యాడు. ఆ కేసులో చిన్నాపై పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత నిందితుడిపై నేరం నిరూపణ కాకపోవటంతో కేసును కొట్టేశారు.
వేరే ప్రాంతాలలో తలదాచుకుంటున్న నిందితుడు
ఆపై చిన్నా భార్యకు విడాకులిచ్చి మరో వివాహం చేసుకొని మంగళగిరిలో ఉన్నాడు. అక్కడ ఉండగా అతనిపై హత్యా యత్నం జరిగింది. అది తప్పించుకుని మళ్ళీ తర్వాత సూర్యాపేటకు మకాం మార్చాడు. ప్రస్తుతం సూర్యాపేటలో ఉంటున్న చిన్నా, రెండు రోజుల క్రితం చిన్నా బాబాయ్ మరణించిన సమాచారం అందడంతో అక్కడకు వచ్చాడు.
బాబాయ్ చావుకు వచ్చిన వాడిపై కత్తులతో దాడి.. మృతి
ఈ క్రమంలో అతను తప్పక వస్తాడని భావించిన బుల్లయ్య కుటుంబ సభ్యులు ప్లాన్ వేసుకున్నారు. బాబాయ్ అంత్యక్రియలకు వచ్చిన చిన్నా టీ తాగేందుకు బయటకు రాగానే దాడి చేసి పగ తీర్చుకున్నారు. కత్తులు , కర్రలతో చేసిన దాడిలో చిన్నా మరణించాడు. నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తుకు గుంటూరు ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.













Click it and Unblock the Notifications