వేమవరం హత్యల్లో మహిళే కీలకం?, నాడు ప్రాణాలతో బయటపడినా ఈ దాడిలో చనిపోయిన అంజయ్య
ప్రకాశం జిల్లా వేమవరంలో జంట హత్యలకు ముందుగానే ప్లాన్ చేసుకొన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యలో ఓ మహిళ కీలకంగా వ్యవహరించిందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
ఒంగోలు: ప్రకాశం జిల్లా వేమవరంలో జంట హత్యలకు ముందుగానే ప్లాన్ చేసుకొన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యలో ఓ మహిళ కీలకంగా వ్యవహరించిందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. నిందితులు వాడిన కత్తులు,కర్రలు కారం డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో చాలా కాలంగా ఫ్యాక్షన్ హత్యలు సాగుతున్నాయి.ఈ నియోజకవర్గంలో గొట్టిపాటి, కరణం కుటుంబాల మధ్య ఈ గొడవలు సాగుతున్నాయి.
గతంలో ఈ రెండు కుటుంబాలు వేర్వేరు పార్టీల్లో ఉండేవారు. గొట్టిపాటి కుటుంబం కాంగ్రెస్ , వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉంటే, కరణం కుటుంబం టిడిపిలో ఉంది. అయితే ఇటీవలనే గొట్టిపాటి రవికుమార్ టిడిపిలో చేరారు.రవికుమార్ టిడిపిలో చేరడాన్ని కరణం బలరాం తీవ్రంగా వ్యతిరేకించారు.
తెలుగుదేశం పార్టీలో రెండు గ్రూపులు కొనసాగుతున్నాయి.అయితే ఈ పరిస్థితుల్లోనే కరణం బలరాం వర్గీయులపై గొట్టిపాటి వర్గీయులుగా అనుమానిస్తున్నవారు హత్యలకు పాల్పడ్డారు.దీంతో మరోసారి ఫ్యాక్షన్ హత్యలకు తెరతీసినట్టైంది.
ప్లాన్ ప్రకారంగానే హత్యలు
వేమవరం జంట హత్యలకు ముందుగానే ప్లాన్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గ్రామంలో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు కూడ ప్లాన్ లో భాగంగానే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు . ఈ ఘటనలో చనిపోయిన ఇద్దరు వ్యక్తులు వివాహం నుండి ఎప్పుడు బయలుదేరారు. ఎక్కడికి చేరుకొన్నారనే విషయాలను ఓ వ్యక్తి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించారని సమాచారం. హతులు స్పీడ్ బ్రేకర్ వద్దకు చేరుకోగానే ఓ మహిళ కారం వారి కళ్ళలో కొట్టగా మిగిలిన వారు కర్రలతో , కత్తులతో దాడిచేసినట్టు సమాచారం.
1989 దాడి ఘటనలోనే పెద్ద అంజయ్యకు కత్తిపోట్లు
పత్తిపాటి సాంబయ్య అనే వ్యక్తిని గొట్టిపాటి వర్గీయులు 1989 లో హతమార్చారనే ఆరోపణలున్నాయి. ఇదే దాడిలో పెద్ద అంజయ్యకు కత్తిపోట్లకు గురయ్యారు. 20 రోజలు పాటు గుంటూరు ఆసుపత్రిలో చికిత్సపొందాడు.అయితే ఈ ఘటనలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. నాడు ఈ ప్రాణాపాయం నుండి తప్పించుకొన్న చివరకు ఆయన మూడు రోజుల క్రితం జరిగిన ఘటనలో ఆయనను మృత్యువు వెంటాడింది.
మృతుల కుమారులు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు
మృతి చెందిన గోరంట్ల పెద్ద అంజయ్య, యోగినాటి కోటేశ్వర్ రావు కుమారులు ఇద్దరూ కూడ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. పెద్ద అంజయ్యకు ఇద్దరు కుమారులున్నారు. వీరిలో పెద్ద కుమారుడు సురేష్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిరపడ్డాడు. మరో కుమారుడు అనిల్ హైద్రాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు. కోటేశ్వర్ రావు కొడుకు వెంకటేశ్వర్లు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.ఈ ఘటనలో నిందితులుగా భావిస్తున్న 24 కుటుంబాల్లో ఒక్కరు కూడ ప్రస్తుతం గ్రామంలో లేరు.గతంలో వేరే రాష్ట్రాలకు బతకడానికి వెళ్ళినవారు కొంతమంది మళ్ళీ గ్రామానికి చేరుకోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకొంటున్నాయని గ్రామస్థులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
హత్యలకు గల కారణాలపై దర్యాప్తు
వేమవరంలో జంట హత్యలకు కారకులుగా భావిస్తున్న 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి ఫోటోలను కూడ విడుదల చేశారు. ఆరు ప్లాటూన్ల ప్రత్యేక పోలీస్ బలగాలతో పికెట్లను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఒక్కో మండలానికి ఒక్కో డిఎస్పీ చొప్పున శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా చర్యలు చేపట్టినట్టు చెప్పారు గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్.నిందితులకు ఆశ్రయం కల్పించినవారిపై కూడ కేసు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ హత్యలు రాజకీయ కోణంలో జరిగాయా లేక పాతకక్షల నేపథ్యంలో జరిగాయా అనే విషయమై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు సంజయ్ చెప్పారు.