క్రికెట్ బెట్టింగ్: గుంటూరు తీగ లాగితే ఢిల్లీ డొంక కదిలింది
గుంటూరు: క్రికెట్ బెట్టింగ్ రాకాసి వ్యవస్థలో ఎంత లోతుగా వేళ్లూనుకుపోయిందో తేటతెల్లం చేసే ఉదంతమిది. గుంటూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న కొందరిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు తెలిసి నివ్వెరపోయారు.
క్రికెట్ బెట్టింగ్ భూతం మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించడానికి బెట్టింగ్ రాయుళ్లకు లేటెస్ట్ టెక్నాలజీ...స్పెషల్ నెట్ వర్క్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిసి ఎస్పీ సైతం విస్తుపోయిన పరిస్థితి. ఈ బెట్టింగ్ మాయాజాలానికి సాంకేతిక తోడ్పాటును అందిస్తున్న కమ్యూనికేషన్ పెట్టల గురించి తెలుసుకొని ఇక్కడ గుంటూరులో వాటి తీగలాగితే ఢిల్లీలో డొంక కదలడం చూసి ఆయనే ఆశ్చర్యపోయారు...వివరాల్లోకి వెళితే...

కమ్యూనికేషన్ బాక్సులు...ఇవే కీలకం
క్రికెట్ బెట్టింగ్ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం వేళ్లూనుకోవడానికి ప్రత్యేక సాంకేతిక నైపుణ్యంతో తీర్చిదిద్దే కమ్యూనికేషన్ పెట్టెలేనని తెలిసింది. అవి లేకుంటే బుకీలు పెద్దఎత్తున బెట్టింగ్ నిర్వహించడం సాధ్యపడదు. అయితే ఈ విషయంపై అంతగా అవగాహన లేని పోలీసులు ఇప్పటి వరకు బెట్టింగ్ రాయుళ్లను మాత్రమే అరెస్టు చేస్తున్నారే తప్ప ఆ పెట్టెలు గురించి, వాటిని తయారుచేసే వారి జాడ గురించి తెలుసుకోలేకపోయారు.ఈ క్రమంలో గుంటూరు రూరల్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఈ క్రికెట్ బెట్టింగ్ పై లోతుగా అధ్యయనం చేయడంతో ఆయనకు కమ్యూనికేషన్ పెట్టల గురించి తెలిసింది.

లోతుగా...విచారణ
ఆ తరువాత ఈ వ్యవహారంలో చాకచక్యంగా వ్యవహరించి వేగంగా పావులు కదిపిన ఆయన చివరకు ఢిల్లీలో ఆ పెట్టెలు తయారు చేసి సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడిని బుధవారం గుంటూరు జిల్లాలోనే అరెస్టు చేయగలిగారు. ఆ క్రమంలో ఈ దందాకు పాల్పడుతున్న మరో ప్రధాన నిందితుని కోసం గాలింపులు చేపట్టారు.
అనంతరం మీడియా సమావేశంలో గుంటూరు రూరల్ ఎస్పీ అప్పలనాయుడు మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. క్రికెట్ బెట్టింగ్ పూర్తిగా అరికట్టాలనే ఉద్దేశంతో కమ్యూనికేషన్ పెట్టెలు ఎవరు తయారు చేస్తున్నారు..?..వాటిని ఎలా సరఫరా చేస్తున్నారు..? వాటి ధర ఎంత ఉంటుంది..?...అనే పలు కోణాల్లో దర్యాప్తును పక్కా ప్రణాళికతో చేపట్టినట్లు ఎస్పీ అప్పలనాయుడు తెలిపారు.

తీగ లాగితే...డొంక కదిలింది
ఈ క్రికెట్ బెట్టింగ్ లో ఇప్పటి వరకు అనేక మంది బుకీలను పట్టుకోవడంలో ప్రతిభ కనపరచిన సీసీఎస్ సీఐ విజయకృష్ణతోపాటు మరికొంతమంది పోలీసులను ఇందుకోసం రంగంలోకి దించామని చెప్పారు. ఆ తరువాత దీనికి సంబంధించి గుంటూరులో తీగలాగితే ఢిల్లీలో డొంక కదిలిందని వెల్లడించారు. ఢిల్లీకి చెందిన జ్యోతి కర్భంద అనే వ్యాపారి తానే రహస్యంగా ప్రత్యేక సాంకేతికతతో ఈ పెట్టెలు తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. వీటిలో ఒక్కో పెట్టెలో 10 సెల్ ఫోన్లకు అవకాశముంటే వాటి ధర రూ.30 వేల నుంచి రూ.40 వేలకు, ఇంకా పెద్ద పెట్టెలు 35 చరవాణిలతో తయారు చేస్తే వాటిని రూ.80 వేలకు విక్రయిస్తున్నట్లు తెలుసుకున్నామన్నారు. ఈ క్రమంలో జ్యోతి కర్భంద అతనికి సమీప బంధువు కుమారుడు వరసయ్యే ఇంటర్ చదివిన విభాష్ ధావన్ ద్వారా ఈ పెట్టెలను విక్రయించడం,సరఫరా చేయడం చేస్తున్నట్లు గుర్తించామన్నారు.

సూత్రధారి...అరెస్ట్
ఎపి రాజధాని ప్రాంతాల్లోనే కాకుండా విశాఖపట్టణం, రాజమహేంద్రవరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా నెలకు సుమారుగా 30 పెట్టెలను వీరు విక్రయిస్తుంటారని తెలిసి ఆశ్చర్యపోయామన్నారు.దీన్ని బట్టి రాష్ట్రమంతా బెట్టింగ్లు వేళ్లూనుకొనడానికి...విస్తరించడానికి వీరే ప్రధాన కారకులుగా భావించవచ్చన్నారు. ఓ బుకీకి ఈ సాంకేతిక పెట్టెలు సరఫరా చేస్తున్న క్రమంలో విభాష్ ధావన్ను గుంటూరు జిల్లా తెనాలిలో అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి రెండు కమ్యూనికేషన్ పెట్టెలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ అప్పలనాయుడు వెల్లడించారు.












Click it and Unblock the Notifications