'బాబు ముస్లిం వ్యతిరేకి', కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
గుంటూరు: ఏపీ సీఎం 'చంద్రబాబు మస్లిం వ్యతిరేకి' అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా విమర్శించారు. ఏపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి అయినా, మంత్రి వర్గంలో ముస్లింలకు చోటు కల్పించడకపోవడంపై మండిపడ్డారు.
గుంటూరు జిల్లాలోని తెనాలి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా ఆదివారం మహబాబ్ బాషా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే ముస్తఫా, అన్నాబత్తుని శివకుమార్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు వ్వవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు బండారం బయటపడుతుందని, రాష్ట్రంలోని 80 శాతం మంది ప్రజలు చంద్రబాబుని దోషిగా పేర్కొంటున్నారని ఆయన తెలిపారు.
కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ సీఎం కేసీఆర్, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేస్తున్న కుట్ర రాజకీయాలను నిరసిస్తూ కృష్ణాజిల్లాలోని చల్లపల్లిలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారిద్దిరికివ్యతిరేకంగా నినాదాలు చేశారు.