ఒకే రోజులో 3పార్టీలు మారారు: గుత్తా, కెసిఆర్పై జీవన్
చిత్తూరు/హైదరాబాద్: రాజకీయాల్లో మార్పులు, చేర్పులు సహజమని, ఒకే రోజు మూడు పార్టీలు మారిన వారు కూడా ఉన్నారని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. గుత్తు సుఖేందర్ రెడ్డి గురువారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ నాయకులకు స్థిరత్వం అనేది ఉండాలని, ప్రజలు అన్నింటినీ గమనిస్తూ ఉంటారని అన్నారు. ఎటుపోయి ఎటువచ్చినా పార్టీలు మారటంతో సంఖ్యాబలం మారుతుందే తప్ప.. పెద్దగా ఒరిగేదిమీ లేదన్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు క్షేమంగా ఉండాలని వెంకటేశ్వరస్వాముల వారిని ప్రార్థించినట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య తాత్కాలికమైన ఉద్వేగాలు ఉంటాయని, వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. రెండు రాష్ట్రాలకు బంగారు భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఇది ఇలా ఉండగా మరో కాంగ్రెస్ సీనియర్ నేత, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టిఆర్ఎస్లో చేరడం బాధాకరమన్నారు. ఫిరాయింపులతో టిఆర్ఎస్ పార్టీ బలపడుతుందంటే.. అది తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు పొరపాటేనని అన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం కంటే ఎన్నికల హామీలపై చిత్తశుద్ధి చూపాలని కెసిఆర్కు జీవన్ రెడ్డి సూచించారు.
గత ఎన్నికల్లో కెసిఆర్కు ప్రత్యామ్నాయ నేతను చూపడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్లో నాయకత్వ లోపముందని, పార్టీని బలోపేతం చేసే సమర్థ నాయకత్వం అవసరముందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications