ఇది 2జీకి మించిన స్కాం: చంద్రబాబుపై జీవీఎల్ నిప్పులు
విజయవాడ: దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత ఖాతాలను తెరిచి రూ. 50వేల కోట్ల అవినీతికి పాల్పడిందని, ఇది 2జీ, బొగ్గు, కామన్వెల్త్ కుంభకోణాలను మించిందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు.
విజయవాడ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణతోపాటు జీవీఎల్ మాట్లాడారు. రాష్ట్రంలో 25 ఎంపీ సీట్ల కోసమే సీఎం చంద్రబాబు పోరాటం, ఆరాటం కనిపిస్తోందని విమర్శించారు. ప్రజా సంక్షేమం, పరిపాలన గాలికి వదిలేశారని మండిపడ్డారు.
తెలుగుదేశం పాలనలో అవినీతి ఏ తరహాలో ఉందనేది 2017-18 కాగ్ నివేదిక చూస్తే స్పష్టమవుతుందన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ శాఖాధిపతుల వద్ద వందల కోట్ల రూపాయల మొత్తాన్ని పర్సనల్ అకౌంట్స్గా వేయడం సహజం అని.. గొప్ప పాలనాదక్షుడిగా చెప్పుకునే చంద్రబాబు అందుకు భిన్నంగా వేల కోట్లు వ్యక్తిగత ఖాతాల్లోకి డిపాజిట్ చేయడం వెనుక కారణాలు తెలియజేస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయస్థానం పర్యవేక్షణలో సీబీఐ విచారణకు ముందుకు రావాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.
కన్నా విమర్శలు
టీడీపీ ప్రభుత్వానికి ప్రచారం మీదున్న శ్రద్ద వ్యవసాయం మీద లేదంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా నమోదైందని, దానికి అనుగుణంగా ప్రభుత్వం ఎందుకు ప్రణాళికలు సిద్ధం చేయలేదంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తోన్న ఇంతవరకు ఎందుకు సమీక్ష నిర్వహించలేదని ధ్వజమెత్తారు. కర్నూలు క్వారీలో జరిగిన ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.