నీ అసలు స్వరూపం బయటపెడతాం, బ్రోకర్లను పంపొద్దని బాబుతో కేంద్రమంత్రి: జీవీఎల్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ వైపు ప్యాకేజీలు తీసుకుంటూనే మరోవైపు ప్రత్యేక హోదా అంటున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు మంగళవారం మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.12 వేల కోట్ల విలువైన 5 ప్రాజెక్టులు వచ్చాయని రాష్ట్రమే ఒప్పుకుందన్నారు.
Recommended Video
మే 30న రాష్ట్రం రాసిన లేఖపై టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇక్కడ దొంగ దీక్షలు చేస్తూనే నిధులు తెచ్చుకుంటున్నారని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణాలలో భారీ అవినీతి జరుగుతోందన్నారు. పోలవరం ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన వరమని, ఇందులో రాష్ట్రం చేసింది ఏమీ లేదన్నారు.
రాజకీయ బ్రోకర్లను తమ వద్దకు పంపవద్దని ఒక కేంద్రమంత్రి.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్కు చెప్పారన్నారు. చంద్రబాబు చేసేది ఒకటి, చెప్పేది మరొకటి అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇలాగే చేస్తే ఆయన అసలు స్వరూపాన్ని, రాష్ట్రం చేసే అరాచకాలను, కేంద్రం అభివృద్ధిని ప్రజలకు ఇలాగే చెబుతుంటామన్నారు.
దొంగ దీక్షలు చేస్తూనే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నారన్నారు. టీడీపీ రాజకీయ ఎత్తుగడలను ఎదుర్కొంటామని చెప్పారు. కేంద్ర నిధులతో చేసే పనులకు టీడీపీ జెండాలు పెడతారా అని ధ్వజమెత్తారు. టీడీపీ రాజకీయ ఎత్తుగడలను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసునన్నారు.
రాష్ట్రానికి నాలుగేళ్లుగా చంద్రగ్రహణం పట్టిందని జీవీఎల్ నిప్పులు చెరిగారు. గ్రహణ ప్రభావానికి రాజకీయంగా దెబ్బతిన్నామన్నారు. నాడు తిరుమలలో అమిత్ షా పైన టీడీపీనే దాడి చేయించిందన్నారు. మీరు ఢిల్లీకి వచ్చినప్పుడు మేమూ అలాగే చేయిస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు.