చంద్రబాబు పార్టీ కార్యక్రమాలకు డబ్బులిస్తే, కోర్టుకీడుస్తాం: అధికారులకు జీవీఎల్ గట్టి వార్నింగ్
విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేతలు చర్చల పేరుతో రచ్చ చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు శుక్రవారం మండిపడ్డారు. అవినీతి తదితర అంశాలపై చర్చలకు రావాలని తమకు సవాల్ చేయడం, తీరా తమకు వచ్చాక పారిపోవడం టీడీపీ నేతల వంతుగా మారిందన్నారు.
గాలి జనార్ధన్ దేశాలు దాటొచ్చు, చిరంజీవి పని తప్పుగా అనిపించలేదా: పవన్కు వర్ల
తాము సవాల్ చేయడం లేదని, టీడీపీ నేతలే సవాల్ చేసి, మేం సిద్ధంగా ఉన్నామంటే పోలీసుల సాయంతో పారిపోవడం ఏమిటన్నారు. ఇలాంటి చచ్చు సవాళ్లు మీకు చేతకాకుంటే మానుకోవాలని టీడీపీ నేతలకు హితవు పలికారు. మేం చర్చల నుంచి పారిపోమని, మీరు పారిపోతున్నారని చెప్పారు.
మాణిక్యాల రావును చర్చలకు పిలిచి, పారిపోయారు
తమ పార్టీ ఎమ్మెల్యే మాణిక్యాల రావును నిన్న చర్చలకు పిలిచి, ఆ తర్వాత టీడీపీ నేతలు పోలీసులను అడ్డు పెట్టుకొని పారిపోయారన్నారు. ఛాలెంజ్ చేసేది మీరేనని, అలాగే పారిపోయేది మీరేనని, ఇలాంటి పిరికిపందలు ఎలా పరిపాలన చేస్తారని ప్రశ్నించారు. సవాల్ విసిరి, పోలీసుల సాయంతో వెళ్లిపోతారని, ఇదేమి సవాల్ అన్నారు.
సుజనా చౌదరి గొంతు బాగాలేదని పారిపోయారు
గతంలో సుజనా చౌదరి చేసిన సవాల్కు తాను ఇరవై నిమిషాలలో ముందుకు వస్తే, ఆయన మాత్రం ఆ తర్వాత గొంతు బాగాలేదని పారిపోయారన్నారు. లోకేష్తో చర్చకు రావాలని కూడా టీడీపీ నేతలు చెప్పారని, తాను సిద్ధమయ్యాక స్థాయి తక్కువ స్థాయి నేతలతో లోకేష్ చర్చకు రారని చెప్పి వెనక్కిపోయారన్నారు. కానీ లోకేష్ స్థాయి ఏమిటని ఎద్దేవా చేశారు. ఆయన స్థాయి ఎక్కువ అని చెప్పడం ద్వారా లోకేష్ను తాము తక్కువ చేసి, చెప్పేలా చూడవద్దన్నారు. ఇక్కడ అందరూ సమానమే అన్నారు. టీడీపీ నేతలు చచ్చు సవాళ్లు విసిరి చీప్గా పోరిపోవద్దని జీవీఎల్ హితవు పలికారు. మాణిక్యాల రావును నిన్న చర్చలకు పిలిచి, హౌస్ అరెస్ట్ చేశారని, తాము అతనిని పరామర్శించేందుకు వెళ్తే పోలీసులు అఢ్డుకున్న తీరు దారుణం అన్నారు. తమను అడ్డుకున్న తీరు చూస్తుంటే అధికార పార్టీకి చెమటలు పట్టించినట్లుగా అర్థమవుతోందన్నారు.
అభద్రతా భావంలో చంద్రబాబు
చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ప్రజాస్వామ్యంపై పాఠాలు చెబుతారని జీవీఎల్ ఎద్దేవా చేశారు. కానీ ఇక్కడ మాత్రం ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారన్నారు. చర్చలకు రమ్మంటారు.. చర్చలకు అనుమతివ్వరని చెప్పారు. పరామర్శకు వెళ్తే ఆపేస్తారా అని నిలదీశారు. నియంతృత్వ ధోరణి మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారని, వినాశకాలే విపరీత బుద్ది అన్నారు. మీలో (అధికార పార్టీ)లో ఒక్కటీ మంచి లక్షణాలు లేవన్నారు.
టీడీపీ కార్యక్రమాలకు ప్రజల సొమ్మా?
చంద్రబాబు రాష్ట్రంలో పరిపాలనను పూర్తిగా వదిలేసినట్లుగా ఉందని జీవీఎల్ ఆరోపించారు. ప్రజల సొమ్ముతో జీతభత్యాలు తీసుకొని, ఆయన పూర్తి సమయం పార్టీ కార్యక్రమాలకు కేటాయిస్తున్నారన్నారు. చంద్రబాబు చేసే విలాస ప్రయాణాలకు ప్రజల సొమ్మును వినియోగిస్తున్నారని, మీరు బెంగళూరు, చెన్నై, ఢిల్లీలకు ఎక్కడికి అయినా వెళ్లవచ్చునని, కానీ ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తే, ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేయడమే అన్నారు. టీడీపీ రాజకీయాలకు ప్రజల సొమ్మును ఎందుకు ఖర్చు చేస్తున్నారని నిలదీశారు. ప్రజలు మిమ్మల్ని చీదరించుకుంటున్నారన్నారు. పాల వ్యాపారం పట్ల చూపే శ్రద్ధ పరిపాలనపై చూపడం లేదన్నారు. ఓ వైపు ధర్మపోరాటం పేరిట దొంగ పోరాటాలు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. మీరు ఎవరితో కలిసినా, ఎక్కడికి వెళ్లినా తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ వేలకోట్లు ఉన్న చంద్రబాబు సొంతగా ఖర్చు పెట్టుకోవాలన్నారు.
ముఖ్యమంత్రికి డబ్బులిస్తే అధికారులూ బాధ్యులే
రాజకీయ కార్యక్రమాల కోసం ముఖ్యమంత్రికి డబ్బులు ఇస్తే అధికారులు కూడా బాధ్యులు అవుతారని జీవీఎల్ హెచ్చరించారు. అలాంటి అధికారులను కోర్టులకు ఈడుస్తామని, వారిని వదిలి పెట్టేది లేదన్నారు. అధికార కార్యక్రమాలు ఉంటేనే ప్రజాధనం వినియోగించాలన్నారు. ఇలాంటి అంశాలను అవసరమైతే కోర్టుకు తీసుకెళ్తామన్నారు.