ఏం మిగిలిందని, ముఖమే చూడం: విజయమ్మపై హరీష్
హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో జీవన విధ్వంసానికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాల్పడ్డారని, తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను అణిచివేశారని అలాంటప్పుడు ఇంకేం మిగిలి ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు గురువారం మండిపడ్డారు.
తెలంగాణ అమరవీరుల త్యాగాలను తన కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సుఖం కోసం, ఆయనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టడానికి పణంగా పెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో పర్యటించే హక్కును ఆ పార్టీ కోల్పోయిందన్నారు. మీ ముఖాలు చూడటానికి తెలంగాణ ప్రజలు ఇష్టపడటం లేదని ధ్వజమెత్తారు. వైయస్ ఈ ప్రాంతానికి చేసిన మోసాలు మదిలో తిరుగుతున్నాయని, ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తారన్నారు.

రాజకీయాలు, మోసాలకు ఒక హద్దు ఉంటుందని, వైయస్ కుటుంబ సభ్యుల కంటే గొప్ప మోసగాళ్లులెవరూ ఉండరని, వారి మోసాలను వివరించటానికి డిక్షనరీలోనే పదాలు దొరకవన్నారు. తెలంగాణ వద్దంటూ సమైక్యాంధ్ర కోసం సభ నిర్వహించిన వైయస్ కుటుంబానికి ఈ ప్రాంతానికి వచ్చే అర్హతలేదని, ఇక్కడి రైతులను పరామర్శించే నైతికత లేదన్నారు. మొదటి నుంచి వైయస్ కుటుంబం తెలంగాణను కొల్లగొట్టిందే తప్ప, ఇక్కడి ప్రజల గురించి ఆలోచించలేదని దుయ్యబట్టారు.
ఇప్పుడు వారి పరామర్శలు, మొసలి కన్నీళ్లకు మోసపోవటానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. తెలంగాణ విషయంలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్యలు, ఆచరణ మాత్రం రాష్ట్ర విభజన ఆగదనేవిధంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అందుకే ఆయన ఆదరాబాదరాగా సొంత జిల్లాకు నిధులను మళ్లిస్తూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications