ప్రధాని పదవి కాదు, జాతీయ రాజకీయాల్లో నాది క్రియాశీలక పాత్ర: కేసీఆర్, మద్దతిస్తానని అఖిలేష్
హైదరాబాద్: ఏ ఒక్కరినో ప్రధానమంత్రిని చేయాలని తాము ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేయడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మధ్యాహ్నం ఒకటి గంటల నుంచి సాయంత్రం మూడు నాలుగు గంటల పాటు మాట్లాడుకున్నారు.
కేసీఆర్తో భేటీ: విందు అనంతరం రాజకీయాలపై చర్చ
అనంతరం కేసీఆర్, అఖిలేష్ సంయుక్తంగా మీడియా ఎదుట మాట్లాడారు. తాము చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చిన్న ప్రయత్నాలని, 2019 ఎన్నికల కోసమని కొందరు భావిస్తున్నారని, కానీ అది కాదని కేసీఆర్ చెప్పారు. ఇంత పెద్ద దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే చాలా కష్టపడాలని, అందు కోసం ముందుకు సాగుతున్నామని చెప్పారు.
అఖిలేష్, నేను రోజు ఫోన్లో మాట్లాడుకున్నాం
అఖిలేష్, తాను గత నెల రోజులుగా ఫోన్లో మాట్లాడుకున్నామని చెప్పారు. తమ ప్రయత్నం 2019 కోసం చిన్న ప్రయత్నం కాదన్నారు. ఈ డెబ్బై ఏళ్ల స్వతంత్ర భారత పాలనలో ఏ వర్గమూ సంతోషంతో లేదని కేసీఆర్ చెప్పారు. ఇప్పటికైనా మార్పు రావాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు ఏం జరిగిందో అది సరిపోలేదన్నారు. దేశంలో మార్పు రావాల్సి ఉందని, అందుకే ఈ ప్రయత్నం అన్నారు.
ప్రధానమంత్రి, మరో ఆలోచన లేదు
రాజకీయాలు కాదని, తాము దేశ అభివృద్ధి కోసం ఆలోచన చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. తమది కేవలం ఆరంభమే అన్నారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందన్నారు. తమకు ప్రధానమంత్రి కావాలనో, మరో ఆలోచనో లేదన్నారు. ఎవరినో ప్రధానిని చేసేందుకు కాదన్నారు. దేశం అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యం తమది అన్నారు. ఏళ్లు గడిచినా ప్రజల ఆకాంక్ష నెరవేరడం లేదన్నారు.
రాజకీయ కోణంలో చూడొద్దు, పొలిటికల్ గేమ్ కాదు
నా అభిప్రాయాలతో ఏకీభవించిన అఖిలేష్కు థ్యాంక్స్ అన్నారు. ఎలాంటి వనరులు లేకున్నా మలేషియా ముందంజలో ఉందన్నారు. తమ ప్రయత్నాలను రాజకీయ కోణంలో చూడవద్దని, పొలిటికల్ గేమ్ కాదన్నారు. నెల రెండు నెలల్లో స్పష్టమైన అంశాలతో ప్రజల ముందుకు వస్తామన్నారు.
ఏదో తెలిసీ తెలియక తమది చిన్న ప్రయత్నమనికొందరు అంటున్నారని కేసీఆర్ చెప్పారు. చెన్నైలో కూడా ఇదే చెప్పానని అన్నారు. చైనా మనకంటే అన్ని రంగాల్లో ముందు ఉందని చెప్పారు. తమది రాజకీయ ఫ్రంట్ కాదన్నారు. జాతీయ రాజకీయాల్లో తాను క్రియాశీలక పాత్ర పోషిస్తానని చెప్పారు.
బీజేపీ హామీలు నెరవేర్చడం లేదు
అనంతరం అఖిలేష్ మాట్లాడుతూ.. తామిద్దరం పలుమార్లు మాట్లాడుకున్నామని చెప్పారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ముందుకు సాగుతోందన్నారు. నాయకులు తమ పనితో ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. కేసీఆర్తో చాలా అంశాలు చర్చించామన్నారు. బీజేపీ తాము ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. యువ శక్తిని సరిగా సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. బీజేపీ దేశ ప్రజలకు ఇచ్చిన హామీల జాబితా చాలా పెద్దదని, కానీ అమలు చేయడం లేదన్నారు.
కేసీఆర్ ఆలోచన నచ్చింది
కేసీఆర్ ఆలోచనా విధానం తనకు నచ్చిందని అఖిలేష్ చెప్పారు. కేసీఆర్తో చాలా అంశాలపై చర్చించామన్నారు. దేశం మార్పు కోరుకుంటోందన్నారు. గుణాత్మక మార్పు కోసం ముందుకు సాగుతామన్నారు. ఇదొక మంచి ప్రయత్నమన్నారు. దేశానికి ఒక దిక్సూచీ కావాలన్నారు. కేసీఆర్ ప్రయత్నాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. హైదరాబాదుతో మాకు ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయన్నారు. యూపీలో సీఎం, ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గాల్లో బీజేపీని ఓడించి మార్పుకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.