గుజరాత్లో ఆందోళనలు: చంద్రబాబు మావాడేనన్న హార్దిక్ పటేల్
అహ్మదాబాద్: తమకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు తమ వాళ్లేనని పటిదార్ అరక్షన్ ఆందోళన సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్ మంగళవారం నాడు అన్నారు.
గుజరాత్లో పటేల్ సామాజికవర్గ ప్రజలు మూకుమ్మడిగా రోడ్డెక్కిన విషయం తెలిసిందే. తమను ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్లో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు.
తమకు రిజర్వేషన్ కల్పించకపోతే 2017లో జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో కమలం వికసించదని, బీజేపీ ఓడిపోతుందని హెచ్చరించారు. ఇది ఘర్షణకు దారి తీసింది. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళన సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్ మాట్లాడారు.

తమ వర్గానికి గుజరాత్లో మంచి రాజకీయ ప్రాధాన్యత ఉందని చెబుతున్నారని, బీహార్ సీఎం నితీష్ కుమార్ తమ వాడే అన్నారు. అలాగే, అందరు తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమంటే... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మావాడే అన్నారు. దేశవ్యాప్తంగా తమకు 170 మంది ఎంపీలు ఉన్నారని చెప్పారు.
కాగా, తమను ఓబీసీల్లో చేర్చాలంటూ నెలరోజుల క్రితమే గుజరాత్ ప్రభుత్వాన్ని పటేల్ సామాజికవర్గం కోరింది. అందుకు అనుకూల స్పందన రాకపోవడంతో మంగళవారం బలప్రదర్శనకు దిగింది. పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి పేరిట జరిగిన సభలో హార్దిక్ పటేల్ మాట్లాడారు.
తాము సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులమని, రాజకీయంగా ఆధిపత్యం సాధించగలిగినా ఉద్యోగాల్లో తమకు అన్యాయం జరుగుతున్నదని, దానిని పూడ్చేందుకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు 50శాతం మించరాదన్న సీఎం ఆనందీ బెన్ ప్రకటనతో వారు విభేదించారు.
స్వయంగా సీఎం తమ వద్దకు వచ్చి వినతి పత్రం స్వీకరించాలని, అప్పటిదాకా నలభై ఎనిమిది గంటలపాటు తాను నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. ఈ ప్రకటనతో మరో నేత లాల్జీ పటేల్ విభేదించారు. అది హార్దిక్ వ్యక్తిగత నిర్ణయమన్నారు.. తాము చర్చలకు సిద్ధమన్నారు. పటేల్ ఆందోళనకు అనుమతి లేదంటూ హార్దిక్ పటేల్ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మళ్లీ ఆందోళన జరగడంతో హార్దిక్ను విడుదల చేశారు.












Click it and Unblock the Notifications