వైసీపీ కవ్వింపు చర్యల్లో కుట్ర - మూడు పార్టీలు గెలిస్తే విజయం : పవన్ కు కాపు సంక్షేమ సేన లేఖ..!!
రానున్న ఎన్నికల్లో టీడీపీ..జనసేన..బీజేపీ కలిస్తే విజయం ఖాయమని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరి రామజోగయ్య చెప్పుకొచ్చారు. కొద్ది రోజులుగా ఏపీలో ఎన్నికల పొత్తుల అంశం రాజకీయంగా హాట్ డిబేట్ గా మారింది. టీడీపీ - జనసేన పొత్తు పైన అంచనాలు మొదలయ్యాయి. అదే సమయంలో వైసీపీ రెండు పార్టీలను టార్గెట్ చేస్తోంది.
ఒంటరిగా పోటీ చేసే సత్తా లేక..పొత్తుతో ముందుకు వస్తున్నాయని ఆరోపణలు చేస్తోంది. అయితే, రెండు పార్టీల నుంచి అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు పొత్తుకు సంబంధించి స్పందన లేదు. ఇదే సమయంలో సీనియర్ పొలిటీషియన్ హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాసారు.

కవ్వింపు చర్యల్లో భాగంగానే
జనసేన పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేయాలంటూ వైసీపీ నేతలు చేస్తున్నది కవ్వింపు చర్యలుగా ఆయన పేర్కొన్నారు. వాటి వెనుక భారీ కుట్ర దాగి ఉందని అభిప్రాయ పడ్డారు. సమయస్పూర్తిగా వ్యవహరించి ..ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పైన ఉందని హరిరామ జోగయ్య లేఖలో స్పష్టం చేసారు.
వైసీపీ పాలనలోని వైఫల్యాలను ఎండగట్టటంతో పాటుగా..సొంత నిధులను వెచ్చించి..ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవటం అభినందీయమని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇస్తే.. రైతుల సంక్షేమానికి ఏం చేస్తారో చెబితే బాగుంటుందంటూ జనసేనానికి జోగయ్య సూచించారు.

ఆ డిమాండ్ తో పోరాటం చేస్తే
అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరిగి..బ్యాంకు రుణాలు తీర్చలేని రైతులను ప్రభుత్వం ఆదుకోవాలనే డిమాండ్ తో పోరాటం చేస్తే బాగుంటందంటూ హరిరామ జోగయ్య జనసేన అధినేతకు రాసిన లేఖలో అభిప్రాయపడ్డారు. హరిరామ జోగయ్య తొలి నుంచి పవన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన అనేక అంశాల పైన పవన్ కళ్యాణ్ కు సూచనలు చేస్తూ వచ్చారు.
రాజకీయ పరిణామాల పైన స్పందిస్తున్నారు. ప్రస్తుతం జనసేన -బీజేపీ పొత్తు పైన భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2024 లో తమ పొత్తు జనసేనతోనే ఉంటుందని బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీతో మాత్రం పొత్తు ఉండదని కమలం పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

ఏపీలో ఆ మూడు పార్టీలు కలుస్తాయా
ఇక, మరో వైపు...పొత్తులకు ఇంకా సమయం ఉందని చెబుతూనే..ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని పవన్ పదే పదే చెబుతున్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే... భవిష్యత్ ఉండదంటూ పవన్ చెబుతున్నారు. టీడీపీ అధినేత సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దీంతో..ఈ రెండు పార్టీల పొత్తు ఖాయమంటూ వైసీపీ నేతలు టార్గెట్ చేయటం ప్రారంభించారు.
ఇక, తాజాగా హరిరామ జోగయ్య ఈ రెండు పార్టీలతో పాటుగా బీజేపీతోనూ పొత్తు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇక, వేడెక్కుతున్న రాజకీయాలతో రానున్న రోజుల్లో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications