గుంజుకోలేదు, తెరాస కోరిన తెలంగాణ వచ్చింది: హరి, ఇబ్బందులు: మిథున్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నిర్వాకం వల్లనే ఇన్ని సమస్యలు వచ్చాయని, 1953 నాటి తెలంగాణ కావాలని తెరాసనే కోరిందని విశాఖ బీజేపీ పార్లమెంటు సభ్యుడు కంభాపంటి హరిబాబు మంగళవారం లోకసభలో అన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సోనియా గాంధీ చెబుతుంటే... కాంగ్రెస్ నేతలు మాత్రం మినహాయింపులను వ్యతిరేకిస్తున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి చెబుతున్నట్లుగా.. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తాము తెలంగాణ రాష్ట్రం నుండి తీసుకోలేదన్నారు. గతంలో అవి ఏపీకి చెందినవేనని చెప్పారు. ఏడు మండలాలను గుంజుకున్నామని తెరాస చెబుతోందని, కానీ ఉద్యమ సమయంలో 1953 నాటి తెలంగాణ కావాలని తెరాస చెప్పిందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రతి విషయంలో రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందన్నారు. పోలవరానికి సోనియా అనుకూలమైతే.. కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. విభజన హామీల పైన ప్రధాని మోడీ నేతృత్వంలో కార్యాచరణ మొదలైందన్నారు.
ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం: మిథున్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక లోటును ఎదుర్కొంటోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ అంశం పైన ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు.
ఇరు రాష్ట్రాలకు న్యాయం కోరిన చంద్రబాబు: ఎంపీ శ్రీనివాస రావు
ఏపీని కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించిందని ఎంపీ శ్రీనివాస రావు అన్నారు. పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు మద్దతిస్తున్నట్లు చెప్పారు. ఇరు రాష్ట్రాలకు సరైన న్యాయం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారన్నారు. పోలవరం ఏపీ ప్రజలకు ఎంతో ముఖ్యమన్నారు. పోలవరం ప్రాజెక్టుకు మరిన్ని నిధులు కేటాయించి, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.