జగన్ కు హరిరామజోగయ్య డెడ్ లైన్- నెలాఖరులోగా కాపు రిజర్వేషన్లు- తేలకపోతే నిరాహారదీక్ష!
ఏపీలో కాపు రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది. కేంద్రం తాజాగా కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇచ్చే అధికారం రాష్ట్రానికి ఉందంటూ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఈ చర్చ జరుగుతోంది. దీంతో కాపులు మరోసారి రిజర్వేషన్లు కల్పించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే కాపు నేత హరిరామజోగయ్య సీఎం జగన్ కు ఇదే అంశంపై డెడ్ లైన్ ఇచ్చారు.
రాష్ట్రంలో కాపులకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఇవాళ వైసీపీ ప్రభుత్వాన్ని కాపు నేత చేగొండి హరిరామజోగయ్య కోరారు. కాపులు ఎదగడం జగన్ కు ఇష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల 31 వరకూ జగన్ కు టైం ఇస్తున్నామని, ఆలోపు కాపులకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసి తీరాలని జోగయ్య కోరుతున్నారు. లేకపోతే వచ్చే ఏడాది జనవరి 2 నుంచి నిరాహారదీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో జోగయ్య హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రాష్ట్రంలో కాపులకు సీఎం పదవి డిమాండ్ తో ఇప్పటికే ఆ సామాజిక వర్గం నేతలు పార్టీలపై ఒత్తిడి పెంచుతున్నాయి. అయినా వైసీపీ కానీ, టీడీపీ కానీ కాపులకు సీఎం పదవి ఇచ్చేందుకు సిద్దంగా లేవు. ఈ నేపథ్యంలో నిన్న విశాఖలో కాపునాడు సభను కూడా నిర్వహించారు. ఈ సభకు వైసీపీ దూరంగా ఉంది. టీడీపీ, జనసేన నేతలు హాజరయ్యారు. అదే సమయంలో కేంద్రం కూడా కాపు రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చేయడంతో సీఎం జగన్ కచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఈసారి కాపులకు రిజర్వేషన్లు ఇస్తే ఓ సమస్య, ఇవ్వకపోతే మరో సమస్య జగన్ కు తప్పేలా లేదు.