జోగయ్య ఆత్మకథ: చిరంజీవిపై ఘాటు వ్యాఖ్యలు,పవన్ కళ్యాణ్పై ప్రశంసలు
ఏలూరు:మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి అండగా నిలవాలని అనుకుని తాను మద్దతు ఇచ్చానని, కాని చిరంజీవి సరిగా తనను వాడుకోలేదని హరిరామ జోగయ్య తన ఆత్మకథ అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం అనే పుస్తకంలో రాశారు. చిరంజీవి టికెట్ల పంపకంపై ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. చిరంజీవి తన జనాకర్షణను ధనార్జనకు వాడుకున్నారని అభిప్రాయపడ్డారు.
చిరంజీవి రాజకీయాన్ని పవన్ కళ్యాణ్కు వదలి సినిమాలలోకి వెళ్లడం మంచిదని సలహా హరిరామ జోగయ్య సలహా ఇచ్చారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ జనసేనను పార్టీగా మార్చాలని కూడా సలహా ఇచ్చానని చెప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ కు నిబద్దత ఉందని జోగయ్య గారు వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి రావాలని జగన్ కోరితే వెళ్లడం, కాని అక్కడ కూడా ఇమడలేకపోవడం, చేరడమే తప్పు అని భావించడం వంటి విషయాలను జోగయ్యగారు ప్రస్తావించారు.జగన్ ది ఒంటెద్దు పోకడ అని అంటూ 2014 ఎన్నికలలో ఆ పార్టీ ఓడిపోవడానికి కారణాలు కూడా ఆయన విశ్లేషించారు.
వర్తమాన రాజకీయాలపై తన అభిప్రాయాలను చెప్పారు. నిజాయితీ, పాలనసమర్దత, సంక్షేమంలో ఆయన ముఖ్యమంత్రులుగా పనిచేసినవారికి మార్కులు ఇచ్చారు. అందరికన్నా అత్యంత నిజాయితీపరుడిగా ఎన్.టి.ఆర్.,అవినీతి శాతం ఎక్కువగా ఉన్న నేతగా వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆయన చెప్పారు. అయితే సంక్షేమ రంగంలో వైఎస్ కు ఆయన అత్యధిక మార్కులు ఇచ్చారు.
ఎన్.టి.రామారావుకు నిజాయితీలో తొంభై శాతం మార్కులు ఇచ్చిన ఈయన చంద్రబాబుకు, కోట్ల విజయభాస్కరరెడ్డికి డెబ్బై శాతం చొప్పున, రోశయ్య, కాసు, జలగం లకు అరవై శాతం మార్కులు ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి ఇరవై శాతం మాత్రమే మార్కులు ఇచ్చారు. కాగా సంక్షేమంలో మాత్రం వైఎస్ కు అత్యధికంగా తొంభై శాతం మార్కులు ఇచ్చారు.
రాజకీయాలలో తనకు సహకరించినవారిని పేరు, పేరున ఈ పుస్తకంలో ప్రస్తావించారు.అలాగే తన కుటుంబ అనుబంధాన్ని కూడా వివరించారు.తను ఏర్పాటు చేసిన అనాధ శరణాలయం గురించి కూడా వివరించారు. ఏలూరులో హైకోర్టు ఏర్పాటు చేయాలని,టిడిపికి పట్టం కట్టిన పశ్చిమ గోదావరికి చేయవలసిన వివిధ అబివృద్ది పనులను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ పుస్తకాన్ని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఎన్.టి.రామారావుకు అంకితం ఇవ్వడం విశేషం.