అధికార వాహనం వద్దన్న హరీష్, సొంత వాహనంలోనే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వేదిక దిగుతున్న వారికి వాహనాలు సిద్ధంగా ఉన్నాయని ప్రొటోకాల్ అధికారులు తెలియజేశారు. అయితే, మంత్రి హరీశ్ రావు ప్రభుత్వ వాహనాన్ని సున్నితంగా తిరస్కరించారు.
రాజ్భవన్ నుంచి ఆయన తన సొంత వాహనంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినం వేడుకలు జరిగిన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్కి, ఆ తర్వాత కేబినెట్ సమావేశంలో పాల్గొనటానికి సచివాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వెళ్లేటప్పుడు కూడా హరీశ్ తన సొంత వాహనంలోనే ఎక్కారు.
ప్రమాణం ముగిశాక జై తెలంగాణ
ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక రాజ్భవన్ ప్రాంగణాన్ని ఆహ్వానితులు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. రాజ్భవన్ ప్రాంగణంలో షామియానాలు వేసి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ చక్రపాణి, ముఖ్యమంత్రి కెసిఆర్ సతీమణి శోభ, ఇతర కుటుంబ సభ్యులు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మంత్రులకు చెందిన కుటుంబ సభ్యులు, తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ, సీపీఐ నేతలు కె నారాయణ, చాడ వెంకట్రెడ్డి, గుండా మల్లేశ్, పలు పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రంగాల ప్రముఖులు, టీజేఏసీ చైర్మన్ కోదండరాం దంపతులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.