హర్షకుమార్ తనయులు రిలీజ్, సమైక్యవాదుల ఆగ్రహం
ఈ ఘర్షణపై ఇరువర్గాలు రాజమండ్రి త్రీ టౌన్ పోలీసు స్టేషన్లో ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. ఎంపీ తనయులు శ్రీరాజ్, సుందర్లను అరెస్ట్ చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే కళాశాలపై దాడికి సంబంధించి సమైక్యవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. కళాశాలపై దాడి చేశారనే కారణంతో కళాశాల ప్రిన్సిపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసిన ఐదుగురికి కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చామని పోలీసులు తెలిపారు.
కాగా ముందుగా నమోదు చేసిన సెక్షన్లను మార్పులు చేసి ఎంపీ తనయులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపి తనయులు విడుదలయ్యారనే విషయం తెలియడంతో మాదిగ దండోరా నాయకులు, సమైక్యవాదులు త్రీ టౌన్ పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేశారు. కేసును తారుమారు చేశారని తప్పుపట్టారు.
ఎపిఎన్జీవోల నేతలపై దాడి చేసిన ఘటనకు సంబంధించి ఎంపి హర్షకుమార్ కేవలం క్షమాపణలు చెబితే చాలదని, ఆయన కుమారుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని ఎపిఎన్జీవోల ఐకాస డిమాండ్ చేసింది. ఇదే క్రమంలో ఆ సంఘటనపై ప్రత్యేక విచారణ జరిపించాల్సిందిగా ముఖ్యమంత్రిని కలిసి డిమాండ్ చేయనున్నామని స్పష్టం చేసింది. విజయనగరంలో ఎంపి ఇంటి ముందు ధర్నా చేస్తున్న ఉద్యోగులపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.