కోనసీమ అల్లర్లపై విచారణకు పిటిషన్- హైకోర్టు ఆగ్రహం-పిటిషనర్ క్షమాపణ
ఏపీలో జిల్లాల విభజన ప్రక్రియ సందర్భఁగా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని కోనసీమ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనంతరం దాన్ని కోనసీమ అంబేద్కర్ జిల్లాగా మార్చింది. దీంతో కోనసీమలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. అయినా ప్రభుత్వం లెక్క చేయకపోవడంతో అది కాస్తా హింసకు దారితీసింది. ఇందులో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లు దహనమయ్యాయి. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
కోనసీమ అల్లర్లపై సిట్టింగ్ జడ్డితో విచారణ చేయించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వాజ్యాలు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉంటాయని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఇలాంటి పిటిషన్ వేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సూచించింది. అంతే కాదు పిటిషన్ ను కొట్టేస్తూ తీర్పు ప్రకటించింది.
కోనసీమ అల్లర్లపై సిట్టింగ్ జడ్డితో విచారణ చేయించాలన్న పిటిషన్ కొట్టేసిన హైకోర్టు.. అంతటితో సరిపెట్టకుండా పిటిషనర్ కు రూ.50 లక్షలు జరిమానా విధిస్తామని కూడా ప్రకటించింది. ఇలాంటి పిటిషన్స్ వేయడం మంచిది కాదని వ్యాఖ్యానించింది. దీంతో పిటిషనర్ ఇరుకునపడ్డారు. హైకోర్టుకు క్షమాపణ చెప్పారు. దీంతో హైకోర్టు దీన్ని పరిగణనలోకి తీసుకుని సరిపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ అమరావతిలో సమావేశమైన ఏపీ కేబినెట్ కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరుకు ఆమోదముద్ర వేసింది.