స్విస్ఛాలెంజ్లో పారదర్శకత ఏది?: ఏపీ సర్కారుకు హైకోర్టు షాక్
హైదరాబాద్: అమరావతిలోని కేంద్ర రాజధాని ప్రాంతం (సీడ్ కేపిటల్)లో స్విస్ఛాలెంజ్ విధానాన్ని అనుసరించి చేపట్టనున్న పనుల ప్రతిపాదనలపై పారదర్శకత లేకపోతే ఎలా అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. యాజమాన్య హక్కుల (ప్రొప్రైటరీ రైట్స్) పేరుతో బిడ్ వివరాలను వెల్లడించకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది.
స్విస్ ఛాలెంజ్ విధానం ఎవరికోసం? ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో ఇంత దాపరికం ఎందుకు? అని నిలదీసింది. ప్రభుత్వ ఆస్తులకు అధికారులు కేవలం ధర్మకర్తలు మాత్రమేనని, ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడానికి ఇవి ప్రైవేటు ఆస్తులు కాదని వ్యాఖ్యానించింది.
సీఆర్డీఏ కమిషనర్ పారదర్శకంగా వ్యవహరించడం లేదంటూ ఆదిత్య హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు విచారణ చేపట్టారు. స్విస్ చాలెంజ్ పద్ధతికి సంబంధించిన సమాచారాన్ని ఆసాంతం వెల్లడించాల్సిందేనని ఆదేశించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించనున్నారు.
తొలుత పాల్గొన్న బిడ్డర్ వివరాలు బహిర్గతం చేయలేమని, అది ఆ సంస్థ యాజమాన్య హక్కని అడ్వకేట్ జనరల్ డి శ్రీనివాస్ వాదించారు. దానిపై న్యాయమూర్తి స్పందిస్తూ 'ఏ సాధికారతతో మీరీ విషయం చెబుతున్నారు?' అని ప్రశ్నించారు. గతంలో జస్టిస్ వివిఎస్ రావు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం స్విస్ చాలెంజ్కు సంబంధించి మొత్తం సమాచారం వెల్లడించాల్సిందేనన్నారు.
సమాచారాన్ని బహిర్గతం చేయలేమన్న అడ్వకేట్ జనరల్ చేసిన వ్యాఖ్యలకు న్యాయమూర్తి స్పందిస్తూ, ఈ మొత్తం విధానం చూస్తుంటే ఇది స్విస్ ఛాలెంజ్ విధానానికి విరుద్ధంగా కనిపిస్తోందని అన్నారు. మీరు నిర్మించబోయేది సొంత ఆస్తులతో కాదు, ప్రజల ఆస్తితో. స్విస్ ఛాలెంజ్ పద్ధతికి కట్టుబడి ఉండకపోతే టెండర్లను ఎందుకు పిలవలేదు అని న్యాయమూర్తి ప్రశ్నించారు.
అధికారులకు సైతం చివరి నిమిషం వరకూ ఏ బిడ్డర్ ఎక్కువ, తక్కువ వేశారో తెలియదని ఎజి వ్యాఖ్యానించారు. పిటిషనర్ ఉద్దేశం ఈ మొత్తం ప్రక్రియను నిలిపివేయాలనే యోచనగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఆ దశలో న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఉద్యుక్తులు కాగా, శుక్రవారం వరకూ గడువు ఇస్తే ప్రభుత్వం తరఫున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామని ఎజి కోరారు.
ఎజి వాదనను తోసిపుచ్చిన న్యాయమూర్తి శుక్రవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని, రిట్ పిటిషన్పై విచారణ కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. తొలి బిడ్డర్ రెవిన్యూ వాటా గురించి అధికారులు వెల్లడించడం లేదని పిటిషనర్ తరఫున హాజరైన న్యాయవాది డి. ప్రకాష్రెడ్డి న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.
స్విస్ఛాలెంజ్ విధానంలో చేపట్టనున్న ప్రగతి పనుల ప్రతిపాదనలు, సీఆర్డీఏ అధికారుల ప్రకటనను సవాలు చేస్తూ ఆదిత్య హౌజింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి మరోసారి విచారణ జరిపారు.