ముగ్గురు మహిళలతో..: పవన్పై షబ్బీర్, కవిత కూడా
నిజామాబాద్/మహబూబ్ నగర్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. నిజామాబాద్ లోకసభకు తెరాస తరఫున పోటీ చేస్తున్న కల్వకుంట్ల కవిత సోమవారం పవన్ పైన మండిపడ్డారు. పవన్ పిచ్చోడిలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. పవన్ మాయమాటలను తెలంగాణ ప్రజలు పట్టించుకోరన్నారు. తెలంగాణలో తెరాసదే విజయమన్నారు.
ముగ్గురు మహిళల జీవితాలతో ఆడుకున్నాడు: షబ్బీర్ అలీ
కేరక్టర్ లేని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటమే సిగ్గుచేటి అని ఎమ్మెల్సీ, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ వేరుగా అన్నారు. ముగ్గురు మహిళల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి ప్రజలకు ఏం చేస్తాడని ప్రశ్నించారు. తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉద్యమాన్ని అమ్ముకున్నారని ధ్వజమెత్తారు.
కెసిఆర్ కుటంబాన్ని జైల్లో పెట్టిస్తా : దానం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కెసిఆర్ కుటుంబాన్ని జైల్లో పెట్టిస్తానని మాజీ మంత్రి దానం నాగేందర్ హెచ్చరించారు. సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ దళితులు, బిసిలను కించపర్చటమే కెసిఆర్ లక్ష్యమన్నారు. మరోసారి సోనియాపై నోరుజారితే ఖబడ్దార్ కెసిఆర్ అని హెచ్చరించారు. వందకోట్లు ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎండి అల్లుడికి టికెట్ ఇచ్చిన కెసిఆర్ తెలంగాణ అభివృద్ధికి ఏం చేస్తారని దానం ప్రశ్నించారు.
మెదక్లో పవన్ సభ
తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మెదక్ జిల్లా గజ్వేల్ సభలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం నుంచి తెరాస అధినేత కెసిఆర్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక చంద్రబాబు వరంగల్ జిల్లా మహబూబాబాద్, మరిపెడలో నిర్వహించనున్న రోడ్ షోలో కూడా పాల్గొంటారు. పవన్ గజ్వేల్తో పాటు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.