చనిపోయిన వ్యక్తికీ కరోనా వ్యాక్సిన్ వేశారు: వైద్యారోగ్య సిబ్బంది తీరుపై విమర్శలు, ఆందోళన
అనంతపురం: కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో వైద్యులు, వైద్య సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారు. అయితే, కొందరు మాత్రం విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ విభాగానికి చెడ్డపేరు తెస్తున్నారు. అలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. చనిపోయి వ్యక్తికి కూడా టీకా వేసినట్లు నమోదు చేయడం ఇప్పుడు వివాదంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. అనంతపురం నగరానికి చెందిన ఓ వ్యక్తి మూడేళ్ల నుంచి హిందూపురంలో నివాసం ఉంటున్నారు. అనారోగ్యంతో జులైలో చనిపోయాడు. అయితే, శనివారం ఉదయం ఆ చనిపోయిన వ్యక్తికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ఆయన కుమారుడి ఫోన్కు మెసేజ్ వచ్చింది. అదే కుటుంబంలో మరో యువకుడు గతంలోనే రెండో డోసు టీకా వేయించుకున్నాడు. ఇప్పుడు మొదటి డోసు పూర్తి చేసుకున్నట్లు మెసేజ్ వచ్చింది. ఇలా ఒకే రోజు రెండు తప్పుడు మెసేజ్లు రావడంతో కుటుంబసభ్యులు షాకయ్యారు.
కాగా, కరోనా టీకాల నమోదుపై ఇప్పటికే జిల్లా అధికారులు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల వారీగా టీకాలు వేస్తున్నారు. ఈ బాధ్యతను వైద్యారోగ్య సిబ్బందితోపాటు ఏఎన్ఎంలకు కూడా అప్పగించారు. పర్యవేక్షణ బాధ్యత మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు అప్పగించారు. అయితే, కొంతమంది సిబ్బంది లక్ష్యాన్ని చేరుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారు.

ఆయా గ్రామాల్లోని ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు సేకరించి టీకాలు వేయకుండానే వేసినట్లు నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత సమాచారాన్ని ఎప్పటికప్పుడు కోవిన్ యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు. దీంతో జిల్లాలలో చాలా మందికి రెండు డోసు వేసుకోకుండానే వేసుకున్నట్లు సమాచారం వస్తోంది. దీనిపై వందల్లో ఫిర్యాదులు వస్తున్నా సాంకేతిక లోపం అని చెప్పి ఉన్నతాధికారులు తప్పించుకుంటున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చాలా మంది టీకాకు దూరమవుతున్నారు. దీంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 49,581 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,145 మందికి కరోనా సోకినట్లు తేలింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో 20,28,785 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనాతో 17 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,967కి చేరింది.
నిన్న 1,090 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,99,651కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,157 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,72,79,362 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా కేసులను గమనించినట్లయితే... అనంతపురం -18, చిత్తూరు - 132 తూర్పు గోదావరి - 216 గుంటూరు - 85 కడప - 111, కృష్ణా - 128, కర్నూలు - 6, నెల్లూరు - 173, ప్రకాశం - 117, శ్రీకాకుళం - 12, విజయనగరం - 7, విశాఖపట్నం - 62, పశ్చిమ గోదావరి - 78 కేసులు నమోదయ్యాయి. కాగా, చిత్తూరు జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం ఒక్కరు చొప్పున మృతి చెందారు.












Click it and Unblock the Notifications